
పాత్ర ఏదైనా అందులో లీనమై నటించే కథానాయిక నిత్యా మీనన్. కళ్లతోనే హావభావాలు పలికించే అతి కొద్ది మంది నాయికల్లో నిత్య ఒకరు. ఎత్తు తక్కువే అయినా.. జీరో సైజ్కు బహుదూరంలో ఉన్నా తన నటనతోనే పేరు తెచ్చుకుందామె. సినిమాల ఎంపికలోనూ నిత్య చాలా జాగ్రత్తగా ఉంటుంది. కథతోపాటు పాత్ర నచ్చితేనే ఒప్పుకుంటుంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ ఆమెకు మంచి క్రేజ్ ఉంది. నాని సరసన ‘అలా మొదలైంది’తో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఆమె నితిన్ తో ‘ఇష్క్’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’ చిత్రాలతో మంచి విజయాలు సొంతం చేసుకుంది. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’లో తన నటనను మరో స్థాయికి తీసుకెళ్లిన ఆమె సోలో హీరోయిన్గానే కాకుండా ఇతర నాయికలతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకూ వెనుకాడడం లేదు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో సెకండ్ హీరోయిన్గా నటించిన ఆమె, ‘ఆ’, ‘గీత గోవిందం’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో చిన్న పాత్రలు పోషించింది.
https://twitter.com/juniorbachchan/status/1271344215918690304
గాయని గానూ గుర్తింపు తెచ్చుకున్న నిత్య ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. డిజిటల్ ప్లాట్ఫామ్లో అడుగు పెట్టింది. ఇప్పటిదాకా సినిమాలకే పరిమితమైన ఆమె వెబ్ సిరీస్లో ఎంట్రీ ఇవ్వనుంది. హిందీ వెబ్ సిరీస్ ‘బ్రీత్ ఇన్ టు ద షాడోస్’ లో నిత్య కీలక పాత్ర పోషించింది. భారీ విజయం సాధించిన తొలి సీజన్లో మాధవన్ లీడ్ రోల్లో నటించగా.. సెకండ్ పార్ట్లో అభిషేక్ బచ్చన్ యాక్ట్ చేస్తున్నాడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఫస్ట్ లుక్ను యూనిట్ రిలీజ్ చేసింది. పగిలిన ఫేస్ మాస్క్ ముక్కల మధ్య ఓ చిన్నారి భయంతో ముడుచుకుని పడుకున్న పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. బాలీవుడ్ హిట్ మూవీ ‘మిషన్ మంగళ్’లో ఓ కీలక పాత్ర పోషించిన నిత్య హిందీ జనాలకు చేరువైంది. ఏ పాత్ర అయినా అద్భుతంగా పండించే నిత్య ఈ వెబ్ సిరీస్తో బాలీవుడ్లో పాగా వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వెబ్ సిరీస్ జులై 10న అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది.
