‘రామారావు’ అనే కుర్రాడు ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి వచ్చాడట, అరె ఉత్త పిచ్చోడిలా ఉన్నాడే, కుర్రాడు బాగున్నాడు గానీ, నిలబడటం కష్టమే.. ఇలాంటి విమర్శలతో రోజులు గడపటానికి కూడా ఎన్టీఆర్ కష్టాలు అనుభవిస్తోన్న రోజులు అవి. కొత్తగా సినిమాల్లోకి వచ్చాడు, అవకాశల కోసం నిర్మాతల చుట్టూ తిరుగుతూ ఆకలికి పస్తులు కూడా పడుకుంటున్న రోజులు అవి. అతి కష్టం మీద అప్పుడప్పుడే అవకాశాలు వస్తున్నాయి. ఆ సమయంలోనే ఎద్దుతో ఎన్టీఆర్ మీద ఒక ఫైట్ సీన్ తీసే సమయంలో.. ఎన్టీఆర్ కి గాయం అయింది. కానీ సెట్ లో డాక్టర్ ఎవ్వరూ లేరు.
కనీసం వైద్యం తెలిసినవాళ్ళు కూడా లేకపోవడంతో ఎన్టీఆర్ అప్పుడు ఇబ్బంది పడ్డారట. అందుకే ఆయన ఆ తరువాత వైద్యానికి సంబంధించిన కొన్ని విషయాలను పట్టుబట్టి నేర్చుకున్నారు. కట్ చేస్తే.. 1959వ సంవత్సరం.. ఎన్టీఆర్ హీరోగా ‘సొంతవూరు’ అనే సినిమా షూటింగ్ జరుగుతోంది. పైగా ఈ సినిమా ఘంటసాలగారిది. ఆయన తీసిన రెండో సినిమా ఇది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రాజసులోచన నాయిక.
అయితే, ఆ రోజు సెట్లో సెట్ ఒకటి కడుతున్నారు. ఆ క్రమంలో సెట్ బాయ్స్ చేసిన తప్పు వల్ల నడిచే దారిలో మేకులూ, చెత్తా పడేశారు. అది చూసుకోకుండా రాజసులోచన షాట్ ముగించుకుని వస్తూ ఉన్నప్పుడు.. ఆమె కాల్లో ఏదో బలంగా గుచ్చుకుని రక్తం కారుతుంది. జీవితంలో తన రక్తాన్ని అంత ఎక్కువుగా ఆమె ఎప్పుడూ చూడలేదట. వచ్చి ఎన్టీఆర్ పక్కనే కుర్చీలో కూర్చొని నెప్పికి తట్టుకోలేక బాధ పడుతుంది.
పక్కన ఎన్టీఆర్ గతంలో తానూ నేర్చుకున్న వైద్యానికి సంబంధించిన మెళుకువులను రాజసులోచన పాదం మీద ప్రయోగించి మొత్తానికి ఆమెకు రక్త స్రావం కాకుండా ఆపారు. ‘ఎప్పుడో పదేళ్ల క్రితం నాకు తగిలిన గాయానికి, నేను అప్పుడు నేర్చుకున్న వైద్యానికి ఫలితం ఇప్పడు దక్కింది’ అని ఎన్టీఆర్ నవ్వుతూ అన్నారు. బాధలో ఉన్న రాజసులోచన కూడా ఆ మాటకు ఫక్కున నవ్వింది.