Film Industry: కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. ఇటీవలే పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో కుంగిపోయిన కన్నడ ప్రజలు తాజాగా మరో సినీ ప్రముఖున్ని కోల్పోయారు. కన్నడ దిగ్గజ నటుడు, నిర్మాత, దర్శకుడు ఎస్.శివరామ్ (83) తుదిశ్వాస విడిచారు. తలకు గాయం కావడం వల్ల గురువారం, బెంగళూరులోని ఆస్పత్రిలో చేరిన ఆయన… ఈరోజు మరణించారు. ఇంట్లో పూజా చేస్తుండగా శివరామ్ కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో తలకు గాయమవ్వగా వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కాగా బ్రెయిన్లో బ్లీడింగ్ అయినట్లు గుర్తించిన వైద్యులు ఆయన వయసు కారణంగా సర్జరీ నిర్వహించలేకపోయారని అంటున్నారు. గత రెండు రోజులుగా ఆయనకు చికిత్స అందిస్తున్నప్పటికీ, శివరామ్ను డాక్టర్లు బతికించలేకపోయారు.
నటుడు శివరామ్ దాదాపు ఆరు దశాబ్దాల పాటు కన్నడ సినిమాల్లో పనిచేశారు. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హాస్య పాత్రలు, సహాయపాత్రలు పోషించారు. 1965 సినిమాలో ‘బేరత జీవా’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు శివరామ్. 90కి పైగా సినిమాల్లో నటించిన ఆయన తన సోదరుడు ఎస్. రామనాథన్తో కలిసి పలు సినిమాలను నిర్మించారు. 1972లో ‘హదయ సంగమ’ సినిమాతో నిర్మాతగా తొలి సినిమా రూపొందించారు. అలానే 1985 లో వచ్చిన బాలీవుడ్ మూవీ ‘గిరఫ్తార్’ నిర్మించింది కూడా ఈయనే. ఇందులో ముగ్గురు స్టార్ హీరోలు అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, రజనీకాంత్ కలిసి నటించడం విశేషం. అలానే 2010-11 ఏడాదికి గాను డాక్టర్.రాజ్కుమార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును కర్ణాటక ప్రభుత్వం శివరామ్కు బహుకరించింది. అలానే 2013లో పద్మభూషణ్ డాక్టర్ బీ.సరోజిని జాతీయ అవార్డు కూడా శివరామ్ ను వరించింది.