హీరోల సినిమాల గురించే అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తూ ఉంటుంది. ఇక, వారి వ్యక్తిగత విషయాల కోసం చెవులు కోసేసుకుంటారు. తమ అభిమాన తారల పర్సనల్ విషయాలపై ఎంతో ఇంట్రస్ట్ చూపిస్తారు. అలాంటి ఓ విషయాన్ని లేటెస్ట్ గా పంచుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. జెమిని టీవీలో ప్రసారమవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు హోస్టుగా వ్యవహరిస్తున్న జూనియర్.. తన పెళ్లి గురించి, తన భార్య గురించి సీక్రెట్ బయట పెట్టాడు.
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు పాపులారిటీ తెచ్చేందుకు జూనియర్ చాలా ప్రయత్నం చేస్తున్నారు. కర్టెన్ రైజర్ షోలో రామ్ చరణ్ తో గేమ్ స్టార్ట్ చేసిన జూనియర్.. తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. చెర్రీ పర్సనల్ విషయాలను కూడా అడిగాడు. ఇక, ఇప్పుడు రెగ్యులర్ కంటిస్టెంట్లతో షోను రన్ చేస్తున్న జూనియర్.. ఇందులోనూ సందర్భం వచ్చినప్పుడల్లా వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నాడు.
తన పెళ్లికి సంబంధించిన టాపిక్ తెచ్చిన జూనియర్.. ఆయన భార్య లక్ష్మీప్రణతితో తొలినాటి పరిచయాన్ని గుర్తు చేసుకున్నాడు. పెళ్లి చూపుల్లో ఒక్క మాట కూడా ఆమె మాట్లాడలేదన్న ఎన్టీఆర్.. ఆ తర్వాత కూడా అదే మౌనాన్ని కంటిన్యూ చేసిందని చెప్పాడు. పెళ్లి చూపుల్లో ప్రణతిని చూడగానే ఓకే చెప్పేసి వెళ్లి పోయాడట తారక్. కానీ.. ఆమె మాత్రం ఎస్ చెప్ప లేదట!
‘‘పెళ్లి చూపుల్లో ప్రణతిని చూడగానే నేను ఓకే చెప్పేసి వెళ్లిపోయాను. కానీ.. మా ఆవిడ మాత్రం నాకు ఎస్ చెప్పలేదు. అలా అని నో కూడా చెప్పలేదు. దీంతో.. నేనంటే ఇష్టమేనా? లేక బలవంతంగా ఈ పెళ్లి ఫిక్స్ చేశారా? అని అడిగాను. దానికి కూడా ఆమె ఔననో.. కాదనో చెప్పలేదు’’ అని నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు జూనియర్.
ఇలా.. ఒకటీ రెండు రోజులు కాదు.. నెలల తరబడి సాగిందట. తమ నిశ్చితార్థానికి పెళ్లికి మధ్య 8 నెలల గ్యాప్ వచ్చిందని, ఈ గ్యాప్ లో కూడా ఆమె ఎస్ అని, నో అని చెప్పలేదట. దీంతో.. ఆడవాళ్లను అర్థం చేసుకోవడం ఎంత కష్టమో.. అప్పుడే తనకు అర్థమైందని అన్నాడు జూనియర్. ఆడవాళ్లను అర్థం చేసుకున్నవాడు దేన్నైనా అర్థం చేసుకోగలడని కూడా తనకు బోధపడిందని చెప్పాడు.