Idupu Kayitham: అప్పట్లో బలగం సినిమా వచ్చింది. అందులో తెలంగాణ మనుషుల మధ్య ఉండే బంధాలకు పెద్దపీట వేశాడు దర్శకుడు. సున్నితమైన అంశాలతో కథ నడిపించి కన్నీరు పెట్టించాడు. అప్పట్లో మాతృదేవోభవ.. గోరింటాకు.. ఆ సినిమాల తర్వాత మళ్లీ ఈ సినిమాకే జనాలు కన్నీళ్లు పెట్టారు.. థియేటర్లకు కదిలారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రొజెక్టర్లు పెట్టి సినిమాలు ప్రదర్శించారు. బలగం సినిమా తెలంగాణ మట్టి భాషకు.. తెలంగాణ మాండలి కానికి.. తెలంగాణ మనుషుల మధ్య ఉన్న బంధాలకు నిదర్శనంగా నిలిచింది.
బలగం సినిమాలో మూలుగ బొక్క కోసం జరిగిన గొడవ ఓ కుటుంబంలో విభేదాలకు కారణమవుతుంది. మూలుగ బొక్క కోసం ఇంత గొడవ జరుగుతుందా అని చాలామంది ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారంతా ఇది ఎలా సాధ్యం అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ అదే అరవింద సమేత సినిమాలో ఐదు రూపాయల కోసం ఊరు ఊర్లు ఫ్యాక్షన్ గొడవలకు ఎలా దిగాయని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తే నోరు మూసుకొని కూర్చున్నారు.
మళ్లీ ఇప్పుడు ఇడుపు కాయితం అనే సినిమాను ఇటీవల ప్రకటించారు. దీనికి బన్నీ వాస్ నిర్మాత. ఈయన కూడా ఆంధ్ర నేపథ్యం ఉన్న వ్యక్తే. ఈ సినిమాలో ప్రియదర్శి.. నాగదుర్గ నటిస్తున్నారు.. ఇడుపు కాయితం అంటే తెలంగాణ రాష్ట్రంలో విడాకులని అర్థం. ఇది ఎప్పటి నుంచో వాడుకలో ఉన్న పదం. ఇటీవల కాలంలో సోషల్ మీడియాను తెలంగాణ పాటలు.. తెలంగాణ మండలి కాలు అదరగొడుతున్నాయి. ఉదాహరణకు రాను బొంబాయి రాను.. అనే పాటను తీసుకుంటే.. వందల కోట్ల వ్యూస్ దక్కించుకుంది. ఇటీవల కాలంలోనే కాదు.. గతంలో కూడా ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ పాట కూడా ఈ స్థాయిలో ఆదరణ దక్కించుకోలేదు. చివరికి అలవైకుంఠపురం లో సినిమా రాములు రాములు పాట కూడా తెలంగాణ మండలికం నేపథ్యంలోనే రూపొందింది.
కొంతకాలంగా తెలంగాణ దర్శకులు కూడా తెలుగుచిత్ర పరిశ్రమ మీద తిరుగులేని ముద్ర వేస్తున్నారు. వారంతా కూడా ఆంధ్రమూలాలు ఉన్న వారి మీద సంపూర్ణమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇది జీర్ణించుకోలేక కొంతమంది తెలంగాణ యాస మీద.. తెలంగాణ మాండలికం మీద.. తెలంగాణ భాష మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఇడుపు కాయితం సినిమాను ప్రకటించిన తర్వాత కొంతమంది కావాలని సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. సినిమాకు సబ్ టైటిల్స్ ఏమైనా ఉంటాయా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ప్రాంతానికి తగ్గట్టుగా యాస ఉంటుంది. బాష కూడా అదే స్థాయిలో మార్పులకు గురవుతూ ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉత్తరాంధ్రలోక విధంగా.. కోస్తాలో మరొక విధంగా.. రాయలసీమలో ఇంకొక విధంగా భాష ఉంటుంది. అలాంటప్పుడు దానికి సబ్ టైటిల్స్ అడుగుతారా.. ఎందుకు ఇంత లేకితనం.. ఎందుకు ఈ మూర్ఖత్వం.. ప్రాంతాల మధ్య.. మనుషుల మధ్య చిచ్చు పెట్టడం కాకపోతే… ఏందిది.. కొంతమంది మూర్ఖత్వం వల్ల.. తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఈ చర్చ అనేక రకాలుగా వెళ్తుంది. అప్పుడు ప్రాంతాల మధ్య మళ్లీ గొడవలు జరుగుతాయి. విద్వేషాలు రగులుతాయి. ఇవన్నీ జరగకూడదు అనుకుంటే మనుషులు మనుషులు మాదిరిగా ఉండాలి. ప్రాంతాలను ప్రాంతాల మాదిరిగా చూడాలి. భాషలను భాషల మాదిరిగా.. యాసలను యాసల మాదిరిగా చూడాలి.
