Pulse Polio Campaign: తెలుగు రాష్ట్రాల్లో జూన్ 28(ఈరోజు) పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దేశాన్ని పోలియో రహితంగా కొనసాగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి ఏడాది ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోంది. వైద్యులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, ఆరోగ్య శాఖ ఉద్యోగులు కలిసి గ్రామాలు, పట్టణాలు, బస్తీలు అన్న తేడా లేకుండా ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించేందుకు ఏర్పాట్లు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సమీపంలోని పోలియో బూత్కు తీసుకెళ్లి తప్పనిసరిగా చుక్కలు వేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే ఈ సమయంలో ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసుకొని పోలియో చుక్కలు వేయించాలని అంటున్నారు. ముఖ్యంగా ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుల సలహా తీసుకోవాలని అంటున్నారు. అవేంటంటే?
పల్స్ పోలియో ఎందుకు అంత ముఖ్యమంటే?
పోలియో అనేది వైరస్ వల్ల వచ్చే ప్రమాదకరమైన అంటువ్యాధి. ఇది ప్రధానంగా ఐదేళ్లలోపు పిల్లలపై ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ నాడీ వ్యవస్థపై దాడి చేసి శాశ్వత అంగవైకల్యానికి దారితీసే ప్రమాదం ఉంది. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. ఈ వ్యాధికి ప్రత్యేక చికిత్స లేకపోవడంతో, పోలియో చుక్కలే అత్యంత ప్రభావవంతమైన రక్షణ మార్గమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే టీకాలు వేసినా.. మళ్లీ చుక్కలు ఎందుకు?
చాలా మంది తల్లిదండ్రుల్లో ఇప్పటికే పిల్లలకు అన్ని వ్యాక్సిన్లు వేశాం.. మళ్లీ పోలియో చుక్కలు ఎందుకు? అనే సందేహం ఉంటుంది. దీనికి వైద్యులు స్పష్టమైన సమాధానం ఇస్తున్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో ఇచ్చే ఓరల్ పోలియో వ్యాక్సిన్ (OPV) అదనపు రక్షణను అందిస్తుంది. ఇది పిల్లల్లో రోగనిరోధక శక్తిని మరింత బలపరచడంతో పాటు సమాజంలో వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటుంది. అందువల్ల గతంలో టీకాలు తీసుకున్న పిల్లలు కూడా ఈ చుక్కలు తప్పకుండా వేయించుకోవాలి.
వాంతులు చేస్తే ఏం చేయాలి?
పోలియో చుక్కలు వేసిన తర్వాత 30 నిమిషాల్లోపు చిన్నారి వాంతులు చేసుకుంటే, ఆ డోసు పూర్తిగా శరీరంలోకి వెళ్లకపోయే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో వెంటనే సమీప ఆరోగ్య కేంద్రం లేదా పోలియో బూత్లో మరోసారి పోలియో చుక్కలు వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో పిల్లలకు అవసరమైన రక్షణ పూర్తిగా అందుతుంది.
జలుబు, జ్వరం ఉన్నా చుక్కలు వేయించవచ్చా?
సాధారణ జలుబు, తేలికపాటి జ్వరం, దగ్గు లేదా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్న పిల్లలకు కూడా పోలియో చుక్కలు వేయించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే అధిక జ్వరం (హై ఫీవర్), తీవ్రమైన అనారోగ్యం లేదా ప్రత్యేక మందులు తీసుకుంటున్న పిల్లల విషయంలో ముందుగా పీడియాట్రిషన్ను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.
తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
పిల్లలను పోలియో బూత్కు తీసుకెళ్లే సమయంలో ఎలాంటి భయం అవసరం లేదు. పోలియో చుక్కలు సురక్షితమైనవి, నొప్పిలేనివి. కార్యక్రమం రోజున పిల్లలకు ఆహారం లేదా తల్లి పాలు ఇవ్వడంపై ఎలాంటి నిషేధం లేదు. అయితే చుక్కలు వేసిన వెంటనే వాంతులు చేస్తే మాత్రం మరో డోసు వేయించుకోవడం తప్పనిసరి.
