WhatsApp Group: రోజురోజుకు సమాజం మారిపోతోంది. ఎంతలా అంటే.. కనీసం చిన్నచిన్న విషయాలను కూడా జనం తట్టుకోలేకపోతున్నారు. ఓర్చుకోలేకపోతున్నారు. సహనంతో ఉండలేకపోతున్నారు. పట్టలేని ఆగ్రహంతో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో మనుషులం అనే విషయాన్ని కూడా మర్చిపోయి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అటువంటి ఘటనలు నేటి కాలంలో పెరిగిపోయాయి. అసలు అలాంటి వారిని చూస్తుంటే మీరు మనుషులేనా అనిపిస్తోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటనలు పెరిగిపోవడం మనుషుల్లో తగ్గిపోతున్న సహనానికి ప్రతీకగా నిలుస్తోంది.. మన సమాజంలో ఎవరైనా సరే ఏదైనా నేరం లేదా ఘర్షణ చోటు చేసుకుంటే పోలీసులను ఆశ్రయిస్తుంటారు. తమకు జరిగిన అన్యాయం మీద ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఫిర్యాదు తో పాటు పోలీసులకు తగిన ఆధారాలు సమర్పిస్తారు. తద్వారా తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం జరిగిన సంఘటన చాలా విచిత్రంగా ఉంది. అసలు మనుషులు ఇలా కూడా ఉంటారా అని అనిపిస్తోంది.
హైదరాబాద్ నగరంలోని బంజర హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎన్బిటి నగర్ లో అక్కడి బస్తీ వాసులు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో స్థానిక సమస్యల గురించి చర్చిస్తుంటారు. ఈ గ్రూపులో రాజకీయపరమైన మెసేజ్లు వద్దని అడ్మిన్ ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఒక మహిళ అదేపనిగా రాజకీయ పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది. మొదట్లో ఆమెను హెచ్చరించారు అడ్మిన్. అయినప్పటికీ ఆమె అదే తీరుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. అడ్మిన్ తట్టుకోలేక ఆమెను గ్రూప్ నుంచి తొలగించారు. అనేక పర్యాయాలు ఆ మహిళ తనను చేర్చుకోవాలని సూచించినప్పటికీ అడ్మిన్ పట్టించుకోలేదు. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను వాట్సప్ గ్రూపులో యాడ్ చేసుకోవడం లేదంటూ పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది.
ఆ మహిళ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ముందుగా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత జరిగిన విషయం తెలుసుకొని నవ్వుకున్నారు.. నేటి కాలంలో ఇలాంటివారు కూడా ఉంటారా అంటూ చర్చించుకున్నారు. చివరికి ఆ మహిళ చెప్పిన విషయాలు నమోదు చేసుకొని.. ఆ తర్వాత ఇరు వర్గాలను పిలిపించారు. కౌన్సిలింగ్ ఇప్పించారు. అయితే ఆ మహిళను ఆ గ్రూపులో యాడ్ చేసుకున్నారా.. లేదా అనే విషయం మీద క్లారిటీ లేదు.
