Prashant Kishor
Prashant Kishor: ఎన్నిల స్ట్రాటజిస్టుగా విశేష ప్రచారం పొందిన వారిలో ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే ఒకరు. ఆయన వేసిన అంచనాల్లో ఒకటో రెండో సక్సెస్ అయ్యాయి. వాటిని చూపి ఫేమస్ అయ్యాడు పీకే. చాలా పర్యాయాలు ఆయన అంచనాలు తప్పాయి. అయినా సక్సెస్ ముందు అవి కనబడలేదు. ఇటీవల ఆయన అంచనాలన్నీ తప్పుతున్నాయి. దానిని కప్పి పుచ్చుకునేందుకు ది వైర్ వెబ్సైట్, ఛానల్ కోసం ప్రఖ్యాత జర్నలిస్టు కరణ్ థాపర్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి.
మచ్చుకు కొన్ని..
– హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి 2022లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని పీకే అంచనా వేశారు. కానీ, అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
– ఇక 2023 నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని పీకే జోష్యం చెప్పారు. ఇక్కడ కూడా కాంగ్రెస్సే అధికారంలోకి వచ్చింది. పీకే లెక్క తప్పింది.
ఈ రెండు అంశాలనే జర్నలిస్ట్ కరణ్ థాపర్ ఎత్తి చూపుతూ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 300లకుపైగా సీట్లు గెలుస్తుందని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. దీనికి పీకే స్పందిస్తూ.. తాను హిమాచల్ప్రదేశ్ బీజేఈపీ, తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పలేదని బుకాయించారు. దీంతో కరణ్.. అప్పటల్లో జాతీయ మీడియాలో ప్రచురించిన పీకే జోష్యం క్లిప్పింగులను చూపడంతో ఆయన తెల్లబోయారు. పత్రికల్లో వచ్చే వార్తలకు విశ్వసనీయత ఉండదంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. దీంతో కరణ్.. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలపై అప్పటల్లో పీకే చేసిన ట్వీట్లను చూపించారు. దీంతో అడ్డంగా దొరికిపోయారు పీకే. ఇక్కడ అసహనం, ఆక్రోశంతో ఊగిపోయారు. మీరు జర్నలిస్తే కాదంటూ «థాపర్పై విరుచుకుపడ్డారు.
కలిసిరాని బీహార్ రాజకీయాలు..
పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత ఇక తాను ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయబోనని పీకే చెప్పారు. ఐప్యాక్ నుంచి తప్పుకున్నారు. తర్వాత బీహార్ రాజకీయాల్లో అడుగు పెట్టారు. తొలుత సీఎం నితీశ్కుమార్ పంచన చేరి జేడీ(యూ) కీలక నేతగా చలామణి అయ్యారు. కొన్నాళ్లకు ఆయనతో విభేదించి సొంత పార్టీ స్థాపించారు. బీహార్లో పాదయాత్ర చేశారు. అయితే పీకే పార్టీకి పెద్దగా ప్రయోజనం కలుగలేదు. దీంతో రాజకీయం అచ్చిరాదని భావించిన పీకే డబ్బుల కోసం మళ్లీ ప్యాకేజీ ఇస్తే వారికి అనుకూలంగా జోష్యం చెప్పడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో చంద్రబాబుకు అనుకూలంగా ఫలితాలు వస్తాయని జోష్యం చెబుతున్నారు.
తప్పిన పీకే అంచానాలు..
గతేడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరాం అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆయన తెలంగాణలో బీఆర్ఎస్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలుస్తుందని జోష్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా, మిగతా మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనూ పీకే జోష్యం తప్పడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లగడపాటి మాదిరిగానే పీకే మారారని పేర్కొంటున్నారు.