Vijayawada: ఏపీలో విషాదం.. ఒకే ఇంట్లో ఐదుగురు మృతి

డాక్టర్ శ్రీనివాస్ ఆర్థోపెడిక్ విభాగంలో పనిచేస్తున్నారు. సొంతంగా శ్రీజ ఆసుపత్రిని నడుపుతున్నారు. ఇంటి ప్రాంగణంలోని ఓ చెట్టుకు శ్రీనివాస్ ఉరివేసుకున్నారు. ఇతర కుటుంబ సభ్యులు నలుగురు పీక కోయడంతో మృతి చెందినట్లు గుర్తించారు.

Written By: Dharma, Updated On : April 30, 2024 3:21 pm

Vijayawada:

Follow us on

Vijayawada: విజయవాడలో విషాద ఘటన జరిగింది. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి తీవ్ర కలకలం రేపింది. స్థానికంగా నివాసముంటున్న డాక్టర్ ఇంటి బయట ఉరి వేసుకున్నాడు. ఇంటి లోపల ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి మృతదేహాలు కనిపించాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు చేపట్టారు.

డాక్టర్ శ్రీనివాస్ ఆర్థోపెడిక్ విభాగంలో పనిచేస్తున్నారు. సొంతంగా శ్రీజ ఆసుపత్రిని నడుపుతున్నారు. ఇంటి ప్రాంగణంలోని ఓ చెట్టుకు శ్రీనివాస్ ఉరివేసుకున్నారు. ఇతర కుటుంబ సభ్యులు నలుగురు పీక కోయడంతో మృతి చెందినట్లు గుర్తించారు. ఈ నలుగురిని హత్య చేసి శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నారా? లేకుంటే ఆ నలుగురిని పీక కోసి శ్రీనివాసును ఉరితీశారా? అన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా డాక్టర్ శ్రీనివాస్ ఈ దుశ్చర్యకు దిగి ఉండవచ్చన్న అనుమానాలు ఉన్నాయి.

విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రామకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులను చంపి వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నారా? లేక అందరూ ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలోనే పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతుల్లో శ్రీనివాస్ భార్య ఉషారాణి, తొమ్మిదేళ్ల కుమార్తె శైలజ, ఐదేళ్ల కుమారుడు శ్రీహాన్, 65 ఏళ్ల తల్లి రవణమ్మ ఉన్నారు. మృతుడు ఇటీవల ఆసుపత్రి ప్రారంభించాడు. అందులో చాలా వరకు నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులే ఈ ఘటనను ప్రేరేపించినట్లు అనుమానాలు ఉన్నాయి. అందుకే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం ప్రారంభించారు.