Bangalore : ప్రేమ ఒక బూటకం.. బంధం అనేది అబద్ధం.. అందుకు ఈ యువతి – యువకుడి ఉదంతమే ప్రబల ఉదాహరణ..

ఊసరవెల్లి కంటే ఎక్కువగా రంగులు మార్చుతున్న మనుషులు.. అంటిపెట్టుకోవలసిన బంధాన్ని దూరం చేసుకుంటున్నారు. కలకాలం నిలుపుకోవాల్సిన ప్రేమను కాలగర్భంలో కల్పిస్తున్నారు. క్షణకాలం వ్యామోహాల కోసం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 27, 2024 5:45 pm

Mahalakshmi murder case

Follow us on

Bangalore : ఇటీవల బెంగళూరులోని మునేశ్వరి నగర్ లో మహాలక్ష్మి అనే నేపాల్ యువతి దారుణ హత్యకు గురైంది.. మహాలక్ష్మిని ఆమె ప్రియుడు ముక్తిరంజన్ రాయ్ దారుణంగా చంపేశాడు. అత్యంత కర్కషంగా ముక్కలు ముక్కలు చేసి ఫ్రిజ్లో దాచాడు. ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ మొదలుపెట్టారు. కాల్ డేటా పరిశీలించి కీలక విషయాలను రాబట్టారు. ఫలితంగా ఈ కేసును సులభంగా చేదించారు. కానీ మహాలక్ష్మి హత్య, ఆమె ప్రియుడి ఆత్మహత్య సరికొత్త ప్రశ్నలను సమాజం ముందు ఉంచుతోంది.. మరుగున పడిపోతున్న బంధాన్ని.. కాలగర్భంలో కలిసిపోతున్న ప్రేమను కాపాడుకోకపోతే ఎంతటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో నిరూపిస్తోంది.

నేపాల్ నుంచి వచ్చి..

మహాలక్ష్మి స్వస్థలం నేపాల్. ఆమె వయసు 26 సంవత్సరాలు. ఆమెకు గతంలో వివాహం జరిగింది. వివాదాల నేపథ్యంలో భర్త హేమంత్ దాస్ తో దూరంగా ఉంటోంది. ఆమె బెంగళూరులోని ఒక మాల్ లో పనిచేస్తోంది. అక్కడే ఒడిశా రాష్ట్రానికి చెందిన ముక్తిరంజన్ రాయ్ తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అనంతరం వారిద్దరూ శారీరకంగా కలవడం మొదలుపెట్టారు. అయితే ఇటీవల ముక్తిరంజన్ రాయ్, మహాలక్ష్మికి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో వారిద్దరూ పలుమార్లు ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఈ నెల మూడున మహాలక్ష్మి ఉంటున్న ఇంటికి వెళ్ళాడు. వారిద్దరి మధ్య వ్యక్తిగత విషయాలకు సంబంధించి గొడవ జరిగింది. దీంతో మహాలక్ష్మి అతనిపై దాడి చేసింది. సహనం కోల్పోయిన అతడు ఆమెను హత్య చేశాడు.. ఆమె శరీరాన్ని 59 ముక్కలు చేశాడు. ఫ్రిడ్జ్ లో భద్రపరిచాడు. ఆమె ప్రవర్తన వల్లే తాను ఈ దారుణానికి పాల్పడ్డారని ఓ లేఖలో పేర్కొన్నాడు. ముందుగా అతడు ఆమె గొంతు పిసికి చంపాడు. అనంతరం బాత్ రూమ్ లో ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. వాటిని ఫ్రిజ్లో పెట్టాడు. బాత్రూం ను యాసిడ్ పోసి శుభ్రం చేశాడు. మహాలక్ష్మి శరీర భాగాలు 20 రోజులుగా ఫ్రిజ్లో ఉండడంతో దుర్వాసన రావడం మొదలైంది. ఆ తర్వాత నాలుగు రోజుల క్రితం ఆమె హత్య వెలుగులోకి వచ్చింది. పోలీసులు కాల్ డేటా పరిశీలిస్తే ముక్తిరంజన్ తో ఎక్కువసేపు మాట్లాడినట్టు పోలీసులకు తెలిసింది. కాగా, ఈనెల 23న ముక్తిరంజన్ తన సొంత ఊరికి వెళ్లిపోయాడు. ఓ స్కూటర్, ల్యాప్ టాప్ తో స్థానికంగా ఉన్న స్మశాన వద్దకు వెళ్లాడు. అక్కడ చెట్టుకు ఉరివేసుకొని చనిపోయాడు.

కేవలం మహాలక్ష్మి – ముక్తిరంజన్ ఉదంతాలు మాత్రమే కాదు.. సమాజంలో ఇలాంటి సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. ప్రేమలు, బంధాలు, ఆప్యాయతలు కనుమరుగవుతున్నాయి. శారీరక సుఖాలే ప్రాధాన్య క్రమమవుతున్నాయి. అందువల్లే పచ్చని సంసారాలు నాశనమవుతున్నాయి. గొప్పగా వర్ధిల్లాలిసిన ప్రేమలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి.