Crime News : అందమైన యువతులు.. ముఖ పరిచయం లేకున్నా.. వాట్సప్ వీడియో కాల్స్.. పొరపాటున ఎత్తారో.. అంతే సంగతులు..

మీరు ఏదైనా పనిలో ఉన్నప్పుడు.. లేదా స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా వాట్సాప్ నుంచి వీడియో కాల్ వస్తే.. అది అపరిచిత నెంబర్ నుంచి వస్తే ఎట్టి పరిస్థితిలో లిఫ్ట్ చేయకండి. ఎందుకంటే అది పెద్ద మోసం.. వలపు వల ద్వారా నిండా ముంచే పన్నాగం.

Written By: Anabothula Bhaskar, Updated On : October 23, 2024 10:04 pm

Crime News

Follow us on

Crime News :  సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత అడ్డదిడ్డంగా సంపాదించే మార్గాలను దుర్మార్గులు ఎంచుకుంటున్నారు. అందులో కొత్త కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు. తాజాగా వాట్స్అప్ ద్వారా డబ్బులను దండుకునే పన్నాగానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే వాట్సప్ వీడియో కాల్స్ చేస్తూ నిండా ముంచుతున్నారు. పురుషుల నెంబర్లను వివిధ మార్గాల ద్వారా సేకరించి.. జేబులను గుల్ల చేస్తున్నారు. ముందుగా వాట్సాప్ లో అపరిచిత నెంబర్ నుంచి వీడియో కాల్ చేస్తారు. ఆ వీడియో కాల్ ఎవరో చేస్తున్నారని ఎత్తగానే ఎదురుగా ఓ అందమైన అమ్మాయి నగ్నంగా ఉండి మాట్లాడుతుంది. ఇక బాధితుడు ఫోన్ ఎత్తగానే.. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ వీడియోను ఆ దుర్మార్గులు రికార్డు చేస్తారు. ఆ కాల్ కట్ చేయగానే అసలు కథ ప్రారంభిస్తారు. ఆ నగ్న వీడియోలు మీ కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరిస్తారు. గ్రూపులలో పెడతామని భయభ్రాంతులకు గురిచేస్తారు. ఆ తర్వాత ఒక అకౌంట్ నెంబర్ పంపించి.. అందులో విడతలవారీగా నగదు వేయించుకుంటారు. ఇలా సైబర్ నేరగాళ్లు కొత్త తరహా దోపిడీకి పాల్పడుతున్నారు. పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొత్త కొత్త విధానాలలో అమాయకులను సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారు. ఇటీవల ఇతరహా సంఘటనలో పెరిగిపోతున్నాయి.. ఇలాంటి అప్పుడే గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తే అసలు లిఫ్ట్ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఒకవేళ వీడియో కాల్ ఎత్తాలి అనుకుంటే ఒక చేతితో కెమెరాను మూయాలని చెబుతున్నారు. అప్పుడు సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ రికార్డు చేసే అవకాశం లేదని వివరిస్తున్నారు.

ఆశకు పోతే ఖాతం మొత్తం ఖాళీ

ఉచితంగా డాటా ఇస్తాం. ఐఫోన్ అందిస్తామని రెచ్చగొట్టే సందేశాలు ఇటీవల పెరిగిపోయాయి. అలాంటి సందేశాల మీద క్లిక్ చేస్తే బ్యాంకులో ఉన్న సొమ్ము మొత్తం ఖాళీ అవుతుంది. ఇలాంటి సైబర్ మోసగాళ్ల సందేశాలను ఎట్టి పరిస్థితిలలో క్లిక్ చేయకూడదు. స్థూలంగా చెప్పాలంటే ఎవరు ఏదీ ఉచితంగా ఇవ్వరు. కేవలం ఉచితం అనే ఎరతో సైబర్ నేరస్తులు మోసాలు చేస్తున్నారు. ఇవి మాత్రమే కాదు ఆన్ లైన్ ఉద్యోగాలు, ఇంటి నుంచి పని చేస్తూ నెలకు లక్షల సంపాదించవచ్చు.. రోజులలో రెట్టింపు రాబడి సొంతం చేసుకోవచ్చు అనే ప్రకటనలు కూడా నమ్మొద్దని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి వాటివల్ల అమాయకులను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు. ఎవరైనా ఇలాంటి ఇబ్బందుల్లో ఉంటే వెంటనే 1930 నంబర్ కు ఫోన్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ఉదాహరణకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది ఈ తరహా సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు పోలీసులకు 292 వరకు అందాయి. ఈ ఘటనల్లో బాధితులు 1.41 కోట్లు నష్టపోయారు. అయితే పోలీసులు 25 లక్షల వరకు సైబర్ నెరగాలకు చేరకుండా బ్యాంకులో నిలిపి వేయించ గలిగారు.. ఖమ్మం నగరంలోని పాండురగాపురం ప్రాంతానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు షేర్ మార్కెట్లో భారీగా లాభాలు వస్తాయని ఓ వ్యక్తి చెబితే 40 లక్షల వరకు పెట్టుబడులు పెట్టాడు. ఆ తర్వాత అది సైబర్ మోసం అని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో వచ్చిన ఓ మెసేజ్ ను ఓ ఉపాధ్యాయుడు క్లిక్ చేశాడు. వారు చెప్పిన వివరాలు మొత్తం అందులో నింపాడు. ఆ తర్వాత అతడి బ్యాంకు ఖాతా నుంచి 73,000 డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. ఈ వ్యవహారంపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక తల్లాడలో అక్టోబర్ 18న కొంతమందికి నగ్న వాట్స్అప్ కాల్స్ వచ్చాయని తెలుస్తోంది. వైరాలో వ్యాపారికి ఇదే తరహా అనుభవం ఎదురైంది. దీంతో అతడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.