Burkina Faso : బైక్ లపై వచ్చారు.. చూస్తుండగానే 600 మందిని ఊచకోత కోశారు.. కనీవినీ ఎరుగని దారుణం ఇది..

సమయం ఉదయం దాటింది. మధ్యాహ్నం వైపు కాలం పరుగులు పెడుతోంది. ఇదే క్రమంలో కొంతమంది ద్విచక్ర వాహనాలపై వచ్చారు. ముఖానికి మాస్క్ లు ధరించారు. చేతిలో మారణాయుధాలతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు.

Written By: NARESH, Updated On : October 6, 2024 8:50 am

Burkina Faso

Follow us on

Burkina Faso : సమయం ఉదయం దాటింది. మధ్యాహ్నం వైపు కాలం పరుగులు పెడుతోంది. ఇదే క్రమంలో కొంతమంది ద్విచక్ర వాహనాలపై వచ్చారు. ముఖానికి మాస్క్ లు ధరించారు. చేతిలో మారణాయుధాలతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. జాతీయ మీడియాలో ప్రసారమవుతున్న కథనాల ప్రకారం ఆఫ్రికా దేశంలో బుర్కినా ఫాసో అనే ప్రాంతంలో మారణ హోమం చోటుచేసుకుంది. బర్సా లోగో పట్టణంలో ఆల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ ఉగ్ర సంస్థ జమాత్ నుస్రత్ ఆల్ ఇస్లాం వాల్ ముస్లిమిన్ అనే సంస్థకు చెందిన సాయుధ ఉగ్రవాదులు మారణ హోమానికి తెగబడ్డారు. కేవలం గంటల వ్యవధిలోనే దాదాపు 600 మందిని కాల్చేశారు. అయితే ఈ ఘటన ఆగస్టు 24న జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ద్విచక్ర వాహనాలపై ఉగ్రవాదులు వచ్చారు. కనిపించిన వారందరినీ కాల్చిపడేశారు. ఉగ్రవాదులు చనిపోయిన వారిలో అత్యధికంగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. ప్రాణ భయంతో పరుగులు పెట్టినప్పటికీ ఉగ్రవాదులు వదిలిపెట్టలేదు. ద్విచక్ర వాహనాలపై వెంబడించి కాల్పులు జరిపారు. అయితే ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత స్థానిక అధికారులకు మృతదేహాలను గుర్తించడానికి మూడు రోజుల సమయం పట్టిందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ ఘటనలో ముందుగా 200 మంది మృతి చెందారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. కానీ 600 మంది దాకా ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ మీడియా చెబుతోంది.. 2015 నుంచి ఈ ప్రాంతంలో ఆ దేశ ఆర్మికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఘర్షణలో 20000 మంది ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. అయితే ఈ ఉగ్రవాద సంస్థకు అరబ్ దేశాల నుంచి భారీగా నిధులు లభిస్తున్నాయని తెలుస్తోంది. అందువల్లే వారి వద్ద అధునాతన ఆయుధాలు ఉన్నాయని.. వాటితో విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నారని సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. బర్సా లోగో ప్రాంతంలో బందోబస్తును పటిష్టం చేసింది. అయితే సమీప గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయం భయంతో వారు బతుకుతున్నారు. ఈ ఘటనను ఐక్యరాజ్యసమితి ఖండించింది. మానవజాతి పై ఉగ్రవాదం చేసిన రక్తపు మరకగా అభివర్ణించింది..

అయితే బర్సా లోగో ప్రాంతంపై పట్టు సాధించడానికి ఉగ్రవాదులు కొంతకాలంగా దాడులు చేస్తున్నారు. ఆ దాడులను ఆర్మీ అధికారులు తిప్పి కొడుతున్నారు. వారు కూడా ప్రతిదాడులు చేస్తున్నారు. అయినప్పటికీ ఉగ్రవాదులు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. మారణ హోమానికి తెగబడి.. ప్రజల్లో తీవ్ర భయభ్రాంతులను కలగజేస్తున్నారు. అయితే ఆర్మీ అధికారులు అధునాతన ఆయుధాలతో ఉగ్రవాదులను మట్టు పెడతామని చెబుతున్నారు. ఇప్పటికే ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ దాడుల్లో ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారనేది తెలియ రాలేదు. ఆ దేశ ఆర్మీ మరింతమంది బలగాలతో దాడులు చేస్తున్నట్టు మాత్రం వార్తలు వస్తున్నాయి.