corona virus
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాపంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు తాజాగా ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ ఎన్440కె ను గుర్తించిన సంగతి తెలిసిందే. ఇతర కరోనా వైరస్ లతో పోలిస్తే ఈ వైరస్ 10 రెట్లు ఎక్కువగా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ ఎన్ 440కె బారిన పడితే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఏపీలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు కావడానికి ఎన్ 440కె కారణమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. గతేడాది డిసెంబర్ నెల చివరి వారంలో శాస్త్రవేత్తలు ఈ కొత్తరకం కరోనా వైరస్ ను కనిపెట్టారు. ఈ వైరస్ కు యాంటీబాడీస్ నుంచి సైతం తప్పించుకునే ప్రత్యేక లక్షణం ఉండటం గమనార్హం.
శాస్త్రవేత్తలు మొదట తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఈ కొత్తరకం వైరస్ ను గుర్తించారు. ప్రస్తుతం ఏపీలో కూడా ఈ రకం వైరస్ వ్యాప్తి చెందుతుండటం గమనార్హం. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మాత్రమే వైరస్ బారిన పడే అవకాశాలు అంతకంతకూ తగ్గుతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మరోవైపు ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేస్తోంది. వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంటే కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో లాక్ డౌన్ ను అమలు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించడం గమనార్హం.