Corona alert in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తరకం వేరియంట్ నమోదవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల వ్యవధిలో పది కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 49కి చేరింది. వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. వైరస్ వ్యాప్తి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసులపై వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది.
గుంటూరు జిల్లాలో అధికం..
ప్రస్తుతం 25 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. మరో 24 మంది మాత్రం ఆస్పత్రుల్లో అడ్మిట్ అయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోవిడ్ యూనిట్లలో చికిత్స పొందుతున్నారు. ఓ అయిదుగురు బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే అత్యధికంగా గుంటూరు జిల్లాలోనే కరోనా కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో మొత్తం ఆ జిల్లాలో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో కొత్త కేసులు కూడా నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు, ఏలూరు కృష్ణా, తిరుపతి, విశాఖపట్నం జిల్లాలో ఒక్కో కొత్త కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులతో ఆయా జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
అంతటా యాక్టివ్ కేసులు..
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 11 యాక్టివ్ కేసులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు జిల్లాలో 9 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కడపలో 8, విశాఖపట్నంలో ఐదు, ఎన్టీఆర్ జిల్లాలో మూడు, కాకినాడ జిల్లాలో రెండు, ఏలూరు జిల్లాలో రెండు, బాపట్ల జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. వరుసగా కేసులు నమోదవుతుండడంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం అయ్యింది. రాపిడ్ రెస్పాన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. అన్ని పీహెచ్సీలకు ఆర్టిపిసిఆర్ టెస్టింగ్ కిట్లను అందజేశారు.


