Gold Price: భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అది ఒక భద్రమైన పెట్టుబడి కూడా. అయితే ఇటీవల పరిస్థితి మారుతోంది. బంగారం ధరలు గత ఏడాది కాలంలో రికార్డు స్థాయికి చేరుకున్న తర్వాత ఇప్పుడు చాలామంది తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయిస్తున్నారు. అసలు దేశవ్యాప్తంగా బంగారం అమ్మకాలు పెరగడానికి కారణం ఏంటీ? ఇప్పుడు బంగారం విక్రయిస్తే లాభాలేనా?
ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) గణాంకాల ప్రకారం.. 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతీయ కుటుంబాలు సుమారు 50 టన్నుల బంగారాన్ని విక్రయించాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 43 శాతం అధికం. ఇంత పెద్ద మొత్తంలో కుటుంబాలు బంగారాన్ని అమ్మడం ఇటీవల కాలంలో అరుదైన పరిణామం.
గత ఏడాది నుంచి అంతర్జాతీయ ఆర్థిక, భౌగోళిక పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ కొత్త గరిష్ఠ స్థాయిలను తాకాయి. దీంతో చాలా మంది పెట్టుబడిదారులు మంచి లాభాల్లోకి వచ్చారు. అయితే ఇటీవల ధరలు కొంత తగ్గుముఖం పట్టడంతో, ఇప్పుడే విక్రయిస్తే లాభాలను ఖరారు చేసుకోవచ్చని భావించి బంగారాన్ని అమ్ముతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీనినే మార్కెట్ భాషలో ‘ప్రాఫిట్ బుకింగ్’ అంటారు.
బులియన్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం బంగారం ధరలు ఇప్పటికే చాలా ఎత్తుకు చేరుకున్నాయి. ఇకపై గతంలా వేగంగా పెరిగే అవకాశం తక్కువగా ఉండొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. అందుకే ధరలు మరింత తగ్గకముందే విక్రయించి నగదు చేతికి తెచ్చుకోవాలని చాలామంది నిర్ణయించుకుంటున్నారు. కొన్ని మార్కెట్ అంచనాల ప్రకారం, రాబోయే రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.20 లక్షల స్థాయికి చేరే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, కొందరు విశ్లేషకులు అంతర్జాతీయ పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, డాలర్ బలాబలాలు వంటి అంశాలపై ఆధారపడి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగవచ్చని కూడా చెబుతున్నారు. అంటే ఇవి కేవలం అంచనాలు మాత్రమే, ఖచ్చితమైన ధరలను ఎవరూ ముందుగా చెప్పలేరు.
ధరలు అనుకూలంగా ఉండటంతో పాటు, విద్య, వైద్యం, గృహ కొనుగోలు, వ్యాపార అవసరాలు వంటి కారణాలతో కూడా కుటుంబాలు బంగారాన్ని విక్రయిస్తున్నాయి. అత్యవసర సమయాల్లో బంగారం సులభంగా నగదుగా మారే ఆస్తి కావడంతో, మంచి ధర లభిస్తున్న సమయంలో దానిని విక్రయించేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు.
ఆర్థిక నిపుణుల సూచన ప్రకారం.. కేవలం ధరలు పెరిగాయనే కారణంతో మొత్తం బంగారాన్ని విక్రయించడం సరైన నిర్ణయం కాకపోవచ్చు. వ్యక్తిగత ఆర్థిక అవసరాలు, భవిష్యత్ లక్ష్యాలు, పెట్టుబడి ప్రణాళికను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది. బంగారం ఇప్పటికీ దీర్ఘకాలిక పెట్టుబడిగా, ద్రవ్యోల్బణానికి రక్షణగా పరిగణించబడుతోంది. అందువల్ల మార్కెట్ అంచనాల ఆధారంగా కాకుండా, ఆర్థిక సలహా తీసుకుని నిర్ణయం తీసుకోవడం మరింత శ్రేయస్కరం.
