Mark Mobios: జోసెఫ్ బెర్న్హార్డ్ మార్క్ మోబియస్ పేరు పారిశ్రామికవేత్తలకు సుపరిచితమే. జర్మన్ కు చెందిన మోబియస్ ఎమర్జింగ్ మార్కెట్ ఫండ్ మేనేజర్, మోబియస్ క్యాపిటల్ పార్ట్నర్స్ LLP స్థాపకుడు కూడా. ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత్ లో తను పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఆర్థిక వృద్ధితో పాటు ప్రధాని నరేంద్ర మోడీ లాంటి నాయకత్వం తనను బాగా ఆకర్షించిందని చెప్పారు. తనకు భారత్ అంటే ‘ప్రేమ’ అని చెప్పుకచ్చారు. భారత్ వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తుందని సోమవారం చెప్పారు. వచ్చే 6 నెలలు లేదా ఏడాది, 3 సంవత్సరాలకు మించి అమెరికాలో మాదిరిగానే భారత్ లో సమానంగా పెట్టుబడులు పెట్టాలని ఆగస్ట్, 2024లో మోబియస్ తన వ్యూహాన్ని వ్యక్తం చేశారు. కాలానుగుణంగా పరిస్థితులు మారవచ్చునని, చైనా వంటి దేశాలు ఆకర్షణీయంగా మారవచ్చని, భారత్ వృద్ధి మార్గం స్వల్పకాలికం కాదని, దీర్ఘకాలికంగా కొనసాగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాలక్రమేణా పరిస్థితులు మారుతాయని, చైనా వంటి దేశాలు పెట్టుబడులకు ఆకర్షణీయంగా కనిపించవచ్చని, కానీ, భారత వృద్ధి మార్గం చైనా కంటే కూడా పెరుగుతూ వెళ్లవచ్చని తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. భారత్ వృద్ధి అనేది చాలా సంవత్సరాలుగా కొనసాగే దీర్ఘకాలిక పరిణామం అన్నారు. కాబట్టి, భారతదేశం ఉండవలసిన ప్రదేశం అని మోబియస్ అన్నారు.
ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్ లో ప్రధాని మోడీ మాట్లాడుతూ భారత్ ను ప్రేమించే అనేక మంది వ్యక్తుల్లో మార్క్ మోబియస్ ఒకరు అన్నారు. ఇక్కడ అవకాశాలపై ఆయన చూపిన ఉత్సాహంపై ధన్యవాదాలు తెలిపారు. గ్లోబల్ ఫండ్స్ భారత స్టాక్ మార్కెట్ లో కనీసం 50 శాతం పెట్టుబడి పెట్టాలని ఆయన చెప్పడం ప్రపంచం భారత్ పై ఉన్న నమ్మకాన్ని సూచిస్తుందన్నారు. దేశం బలమైన మార్కెట్ నుంచి ప్రయోజనం పొందేందుకు గ్లోబల్ ఫండ్స్ కు అందుబాటులో ఉన్న విస్తారమైన అవకాశాల గురించి ఆయన తెలిపారు.
అనేక ఏజెన్సీలు భారత్ కోసం వృద్ధి అంచనాలను సవరించాయని, తమ ప్రభుత్వం మూడో పదవీకాలంలో సాధించిన వేగవంతమైన పురోగతి దీనికి కారణమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. గత 125 రోజుల్లో పేదలకు రూ. 3 కోట్ల కొత్త ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని. రూ. 9 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించిందని మోడీ తెలిపారు.
ప్రపంచ అనిశ్చితి, సవాళ్ల మధ్య భారత్ ప్రపంచానికి నేడు ఆశాదీపంగా నిలిచిందన్నారు. సొంత ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ, ప్రపంచ ఉద్రిక్తతల మధ్య కూడా సానుకూల దృక్పథం దేశాన్ని ముందుకు నడిపించింది. అంతేకాక, భారత్ వృద్ధి అన్ని రంగాల్లో అపూర్వ స్థాయిలో కొనసాగుతోందని, ప్రపంచం వివిధ ఆందోళనలు, అస్థిరతలతో సతమతం అవుతున్నప్పటికీ ‘భారతీయ శతాబ్దం’ నేపథ్యంలో చర్చనీయాంశం, ఆశావాదంగా మారిందని మోడీ పేర్కొన్నారు.
ఐఎంఎఫ్ నామమాత్ర జీడీపీ అంచనాల ప్రకారం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మారుతోంది. ఇది 2025 నాటికి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని విశ్లేషకులు ఇప్పటికే చెప్పారు.