మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. 2022 – 2023 మార్కెటింగ్ సీజన్లో రబీ పంటలకు కనీస మద్దతు ధరలను పెంచడానికి చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. గతేడాదితో పోలిస్తే అత్యధికంగా మద్దతు ధరను పెంచుతూ కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రైతులు పంటల సాగులో వైవిధ్యం ప్రదర్శించాలని అన్ని రకాల పంటలకు కేంద్రం మద్దతు ధరను ప్రకటించింది.
గోధుమలు, బార్లీ, శనగలు, చెరకు, ఆవాలపై కేంద్రం మద్దతు ధరలను పెంచగా 2022 – 23 మార్కెటింగ్ సీజన్ లో ఈ ధరలు వర్తిస్తాయి. రేప్సీడ్లు, ఆవాల పంటకు ప్రతి క్వింటాల్కు రూ. 400 చొప్పున కేంద్రం మద్దతు ధర పెంచింది. క్వింటాల్ చెరకు మద్దతు ధరను కేంద్రం 290 రూపాయలు పెంచింది. గోధుమలపై రూ.40, బార్లీ రూ.35 , శనగలపై రూ.350 కేంద్రం మద్దతు ధరను పెంచడం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం డిమాండ్-సరఫరా అసమతుల్యతను సరిచేయడానికి ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అన్నదాతల ఆదాయాన్ని పెంచడంతో పాటు అదనపు ఉపాధిని కల్పించాలని కేంద్రం భావిస్తుంది.