Apple Company : యాపిల్‌కే కన్నం వేశాడు.. భారతీయ ఉద్యోగి చేసిన ఘరానా మోసమిదీ!

ధీరేంద్ర ప్రసాద్‌కు యాపిల్‌ సంస్థకు కావాల్సిన ఆయా ప్రొడక్ట్‌ల విడి భాగాల్ని ఇతర సంస్థల నుంచి కొనుగోలు చేసే అధికారం ఉంది. ఈ సమయంలో ధీరేంద్ర ప్రసాద్‌ తన దుర్బుద్ధిని చూపించారు

Written By: NARESH, Updated On : April 30, 2023 11:57 am

apple company

Follow us on

Apple Company : టెక్‌ దిగ్గజం యాపిల్‌.. ఈ సంస్థకు పైరసీ.. ట్యాపింగ్‌.. హ్యాకింగ్‌ సెక్యూరిటీగా గుర్తింపు ఉంది. అలాంటి సెక్యూరిటీ వ్యవస్థ ఉన్న సంస్థనే ఓ భారతీయుడు బురిడీ కొట్టించాడు. కోటి.. రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ.138 కోట్లు కొట్టేశాడు. చివరకు దొరికిపోయాడు. కోర్టు అతడికి మూడేళ్ల జైలు శిక్షతోపాటు, 19 మిలియన్‌ డాలర్లు సంస్థకు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఈమేరకు యూనిటైడ్‌ స్టేట్స్‌ అటార్నీ ఆఫీస్‌ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

పదేళ్లు అదే సంస్థలో ఉద్యగం..
భారత్‌కు చెందిన ధీరేంద్రప్రసాద్‌ అమెరికాలోని యాపిల్‌ గ్లోబల్‌ సర్వీస్‌ సప్లయ్‌ చైన్‌ విభాగంలో 2008 నుంచి 2018 వరకు విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అతనిపై మార్చి 2022లో అభియోగాలు నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్‌లో సైతం ట్యాక్స్‌ సంబంధిత నేరాలకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించారు.

ఏం చేశాడంటే..
ధీరేంద్ర ప్రసాద్‌కు యాపిల్‌ సంస్థకు కావాల్సిన ఆయా ప్రొడక్ట్‌ల విడి భాగాల్ని ఇతర సంస్థల నుంచి కొనుగోలు చేసే అధికారం ఉంది. ఈ సమయంలో ధీరేంద్ర ప్రసాద్‌ తన దుర్బుద్ధిని చూపించారు. తన పదవిని అడ్డం పెట్టుకుని సంస్థకు కావాల్సిన విడిభాగాలను ఆర్డర్‌ పెట్టడం.. కంపెనీకి తెలియకుండా వాటిని ఇతర సంస్థలకు అమ్మడం చేశాడు. ఇక అక్రమ లావాదేవీల్లో పాలుపంచుకున్నందుకు గాను సదరు సంస్థలకు చెల్లింపులు, ప్రొడక్ట్‌లను దొంగిలించడం, తప్పుడు ఇన్‌వాయిస్‌లను తయారు చేయడం, ఇందుకుగాను రెండు వెండర్‌ కంపెనీల యజమానులతో కలిసి కుట్ర పన్నినట్లు, వచ్చిన ఆదాయంపై పన్ను ఎగవేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

నమ్మకాన్ని వమ్ము చేశాడు..
ఎంతో నమ్మకంతో పనిచేస్తారని పేరు సంపాదించిన ప్రసాద్‌పై యాపిల్‌ యాజమాన్యం లెక్కలు, ప్రొడక్ట్‌లు ఇతర విషయాల్లో జోక్యం చేసుకునేది. కంపెనీ తనపైన పెట్టుకున్న నమ్మకాన్నివమ్ము చేశాడు. చేసిన పాపం బయటపడింది. యాపిల్‌ కంపెనీలో ప్రసాద్‌ చేసిన కుంభకోణం వెలుగులోకి వచ్చింది. యాపిల్‌ కోసం విడి భాగాలు కొనుగోలు చేసే అంశంలో సుమారు 17 మిలియన్లకు పైగా మోసం చేశారు. పన్నుకూడా చెల్లించలేదు.

కోట్లకు అధిపతి..
యాపిల్‌లో తన పదవిని అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారు. సంస్థలో ప్రొడక్ట్‌ల కొనుగోళ్ల విషయంలో స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉండడం, దాన్ని దుర్వినియోగం చేస్తూ జీతం, బోనస్‌లను యాపిల్‌ నుంచి అక్రమంగా సంపాదించి కోట్లకు అధిపతి అయ్యాడు. అంతేకాదు సంస్థలో నేరాలకు పాల్పడే ఉద్యోగుల్ని యాపిల్‌ సంస్థ ఎలా కనిపెడుతుందో తెలుసుకొని జాగ్రత్త పడ్డారు. తన అధికారాన్ని ఉపయోగించి వాటి నుంచి బయటపడ్డారు.

మూడేళ్ల జైలు శిక్ష
ఆయా నేరాలకు పాల్పడినందుకు ప్రసాద్‌కు 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది. నేరం ఒప్పుకున్న నిందితుడు.. మోసం చేసి సంపాదించిన డబ్బుల్ని, ఆస్తుల్ని తిరిగి చెల్లించాలి. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరో 3 ఏళ్ల పాటు నిశితంగా గమనించిన మరోసారి చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.