benz car
ఏపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైసీపీ ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేకంగా మంత్రులను టార్గెట్ చేసి మాట్లాడుతుండడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. నిన్న ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన ఆయన.. నేడు కార్మికశాఖ మంత్రి కోమటి జయరాంపై ఘాటు విమర్శలు చేశారు.
Also Read: చంద్రబాబు ఇప్పటికైనా తన తీరును మార్చుకోరా…?
బెజవాడ ఆలయం వెండి రథంలోని మూడు సింహాల విగ్రహాలు లాకర్లోనో, స్టోర్ రూంలోనో కాకుండా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంట్లో తనిఖీలు చేయాలంటూ అంటూ గురువారం అయ్యన్న ఘాటుగా ట్వీట్ చేశారు. శుక్రవారం ప్రెస్మీట్ పెట్టిన ఆయన కార్మిక శాఖ మంత్రితోపాటే.. జగన్ సర్కార్పై విరుచుకుపడ్డారు.
అంతేకాదు.. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపరులపై ఫిర్యాదు చేసేందుకు ప్రేవేశపెట్టిన 11440కు లైవ్లో కాల్ చేసి మంత్రి కుమారుడు ఈశ్వర్పై ఫిర్యాదు చేశాడు. ‘మంత్రి కొడుకు ఈశ్వర్కు, ఇప్పటికే ఈఎస్ఐ స్కాములో అరెస్ట్ అయిన ఏ-14 కార్తీక్ గిఫ్ట్ ఇచ్చాడు. ఖరీదైన కారును మంత్రి కుమారుడికి పుట్టినరోజున సందర్భంగా ఇచ్చారు. కారుకు ఫైనాన్స్ చేయించి మరీ కార్తీక్ ఇచ్చారు. ఏ సంబంధంతో కారును కానుకగా ఇచ్చారో మంత్రి సమాధానం ఇవ్వాలి’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
Also Read: న్యాయస్థానాలతో పెట్టుకోవడం జగన్ వ్యూహంలో భాగమా…?
‘ఏ 14 కార్తీక్ మంత్రి జయరాంకు బినామీ. అది పుట్టినరోజు కానుక కాదు.. మంత్రికి ఇచ్చిన లంచం. కార్మిక శాఖలో అవినీతికి పాల్పడింది అచ్చెన్నాయడు కాదు.. మంత్రి జయరాం. నేనే ఆధారాలతో చూపిస్తున్నా.. నిరూపిస్తా కూడా. దీనిపై విచారణ జరిపించాలి. న్యాయస్థానంతో విచారణ చేయించాలి. ముఖ్యమంత్రికి కార్మికశాఖ మంత్రి కోమటి జయరాంపై దర్యాప్తు చేసే దమ్ము ఉందా..? మేము ప్రశ్నిస్తే మమ్మల్ని ముఖ్యమంత్రి బూతులు తిట్టిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ముఖ్యమంత్రి నోరు మెదపరు. జగన్కు చిత్తశుద్ధి ఉంటే మంత్రి జయరాంతో రాజీనామా చేయించాలి. మంత్రి మండలి నుంచి జయరాంను తప్పించాల్సిందే. బీసీ నేతలను టచ్ చేస్తే ఊరుకోం. మా ఆగ్రహానికి ముఖ్యమంత్రి సమాధి అయిపోతారు. నా ఆరోపణలపై ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో చూస్తాను. మాకు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు అంటే ఇష్టం’ అని అయ్యన్న సంచలన ఆరోపణలు చేశారు.