YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ పట్టు దక్కడం లేదు. పైగా పార్టీకి తప్పిదాలు వెంటాడుతున్నాయి. అయితే తాజాగా అమరావతి విషయంలో మరోసారి కార్నర్ అయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అమరావతి రైతులు అడ్డుకోవడమే కాదు వైసిపి నేతల వెంటపడి మరి తరిమారు. దీంతో వారి మనసు మారలేదని అర్థం అయింది. ఈ పరిణామంతో ఓ రెండు జిల్లాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశలు వదులుకోవాల్సిందే నన్న టాక్ నడుస్తోంది. ప్రధానంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రజల వైఖరిలో మార్పు రాలేదని అర్థం అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో కూడా ఆందోళన అదే. పైగా ఆ రెండు జిల్లాల నేతలు పై వివాదాస్పద ముద్ర ఉంది. వారి వైఖరితో పాటు వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆ పార్టీకి శాపంగా మారాయి.
* అప్పట్లో వైసీపీకి జై కొట్టినా..
2014 నుంచి 2019 మధ్య టిడిపి అధికారంలో ఉంది. అప్పట్లో చంద్రబాబు సర్కార్ అందరి అభిప్రాయంతో అమరావతిని ఎంపిక చేసింది రాష్ట్ర రాజధానిగా. అప్పట్లో జగన్ మోహన్ రెడ్డి సైతం అమరావతిని సమ్మతించారు. అదే అమరావతి పరిధిలో సొంత ఇల్లు కూడా కట్టుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అని.. అందుకే తాను శాశ్వత నిర్మాణం ఏర్పాటు చేసుకున్నానని చెప్పుకొచ్చారు జగన్. అమరావతి ప్రాంత రైతులు కూడా నమ్మారు. అంతులేని అభిమానంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. చివరికి మంగళగిరిలో పోటీ చేసిన లోకేష్ సైతం ఓడిపోయారు అంటే ఏ స్థాయిలో అభిమానం చూపారో అర్థం అవుతుంది.
* అక్కడ టిడిపికి బలం..
వాస్తవానికి కృష్ణాతో పాటు గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలం ఎక్కువ. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా కనీసం ఉనికి చాటుకుంటూ వస్తూ వచ్చింది. ఒకటి రెండు స్థానాలను సైతం దక్కించుకునేది. కానీ 2019 ఎన్నికల్లో ఆ రెండు జిల్లాల్లో పార్టీ ఓడిపోయింది. కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. అంతలా ప్రజలు వైసీపీని ఆదరిస్తే అమరావతిని వ్యతిరేకించారు. దాదాపు నిర్వీర్యం చేశారు. రాజధానితో ఆ రెండు జిల్లాలకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని భావించిన ప్రజలకు నిరాశ ఎదురయింది. అయితే ఇప్పుడు అదే పనిగా అమరావతి పై కుట్రలు చేస్తుండడం.. రోజుకో మాట ఆడుతుండడంతో ఆ రెండు జిల్లాల ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. 2029 ఎన్నికల్లో సైతం ఆ రెండు జిల్లాల పై ఆశలు వదులుకోవాల్సిందేనన్న టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాష్ లాంటి వారి తీరు మరింత వివాదాస్పదం అవుతోంది. అందుకే ఆ రెండు జిల్లాలపై ఆశలు వదులుకోవాల్సిందేనన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.
