Prashant Kishore YSRCP Comeback: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధినేత జగన్మోహన్ రెడ్డి సరైన రాజకీయ వ్యూహకర్త కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పటి తన పాత సహచరుడు ప్రశాంత్ కిషోర్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో బీహార్ నుంచి పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ పార్టీ ఉనికి చాటుకోలేకపోయింది. ఆయన ప్రయత్నాలు ఏవి అక్కడ వర్కౌట్ కాలేదు. అందుకే ఇప్పుడు రాజకీయాలు వదిలి మళ్లీ వ్యూహకర్తగా వస్తారని ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆయన కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సరైన వ్యూహ కర్త దొరకలేదు. మొన్నటి ఎన్నికల్లో ఐప్యాక్ టీం ఆయనను గట్టెక్కించలేకపోయింది. కొత్త కొత్త వారు తెరపైకి వస్తున్న జగన్మోహన్ రెడ్డిని అంతగా సంతృప్తి పరచలేకపోతున్నారట. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ ను మరోసారి సంప్రదించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతోందని తెలుస్తోంది.
Also Read: పవర్ హౌస్గా కరీంనగర్.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక ముద్ర..
* గట్టెక్కించే వారు కావాలి..
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఆ పార్టీ ఇప్పుడు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అయితే ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు సరైన వ్యూహకర్త వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిక్కడం లేదు. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. పార్టీని గాడిలో పెట్టేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏవి కొలిక్కి రావడం లేదు. అయితే తాజాగా బిజెపి కోసం పనిచేసిన వ్యూహకర్త శంతను సింగ్ వంటి వారిని లైన్లోకి తెచ్చినట్లు ప్రచారం నడిచింది. అటు తరువాత జాతీయస్థాయి కన్సల్టెంట్లు తెర పైకి వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి తీరు, ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా ఎవరు ఇమడలేక పోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
* కొత్తగా ఈషా సింగ్
అయితే తాజాగా ఈషా సింగ్( Isha Singh) అనే యువ వ్యూహ కర్త పేరు తెర పైకి వచ్చింది. ఈమె గతంలో పలువురు ప్రముఖులకు సోషల్ మీడియా, పొలిటికల్ బ్రాండింగ్ విభాగాల్లో పని చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె నేతృత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇమేజ్ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యూహకర్తలు కేవలం సోషల్ మీడియా మేనేజ్మెంట్ కు పరిమితమవుతున్నారే తప్ప.. ప్రత్యర్థి కూటమిని ఢీకొట్టే బలమైన రాజకీయ అజెండాను సృష్టించడంలో విఫలమవుతున్నారని అభిప్రాయం ఉంది.
* చివరకు ఆయనే గతి..
ప్రస్తుతం ఎవరు నిలబడకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చివరకు తన పాత మిత్రుడు ప్రశాంత్ కిషోర్( Prashant Kishore ) వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చిరస్మరణీయమైన విజయం అందించారు. కానీ ఎందుకో తర్వాత జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు వెళ్లిపోయారు. తన సొంత చరిష్మతో గెలిచానన్న భావన జగన్మోహన్ రెడ్డిలో కలగడమే వారి విడిపోవడానికి కారణమని అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవసరం కావడంతో ప్రశాంత్ కిషోర్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మరి ఆయన వ్యూహకర్తగా ఉండేందుకు ఒప్పుకుంటారా? లేదా అనేది చూడాలి.
