YSRCP popularity graph: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తోంది. వచ్చే నెల 12 నాటికి రెండేళ్లు పూర్తికానుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైన ఈ రెండు సంవత్సరాల్లో.. ఆ పార్టీకి గ్రాఫ్ పెరిగిందా? తగ్గిందా? అంటే సరైన సమాధానం దొరకని పరిస్థితి. అయితే ఒక్క మాట మాత్రం చెప్పగలం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు ను ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేక పోతున్నారు.. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపిస్తోంది. ముఖ్యంగా పారిశ్రామిక పెట్టుబడులతో పాటు అభివృద్ధి పనులను చేసి ప్రజల దృష్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లకుండా చూస్తోంది. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుణ పాఠాలు నేర్చుకోలేదు. ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేయలేదు. వారితో మమేకం కాలేకపోతోంది కూడా.
నిత్యం నీడలా అమరావతి..
అమరావతి రాజధాని అంశం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నీడలా వెంటాడుతూనే ఉంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రతిపాదన చేసిన మావిగన్ పై ప్రజల్లో ప్రతికూలత తెచ్చింది. ఆయన మాటలను ప్రజలు చాలా తేలిగ్గా తీసుకున్నారు. అదేదో కొత్త ప్రతిపాదన కంటే అమరావతిపై విషం చిమ్మడమే అనేది మెజారిటీ ప్రజల అభిప్రాయం. గతసారి టిడిపి అధికారంలోకి వచ్చినప్పుడు అమరావతిలో గ్రాఫిక్స్ చేశారు అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలను ప్రజలు నమ్మారు. ఇప్పుడు కూడా అమరావతిపై పదే పదే ఆ తరహా ప్రచారం చేయడానికి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో అమరావతి రాజధాని అనేది ఒక అజెండాగా తీసుకున్నారు ప్రజలు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అయినా పదేపదే దాని జోలికి వెళ్లి ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
శాసనసభకు హాజరు కాకపోవడం..
జగన్మోహన్ రెడ్డి శాసనసభకు హాజరు కాకపోవడం సైతం ఆ పార్టీకి మైనస్. కేవలం ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజల గురించి సభకు వచ్చి మాట్లాడతానని జగన్ చెప్పడాన్ని ఎవరు హర్షించడం లేదు. పైగా ప్రజల మధ్యకు జగన్మోహన్ రెడ్డి వచ్చింది చాలా తక్కువ. ప్రస్తుతం ఆయన తన సొంత పార్టీ నేతల అరెస్టు సమయంలోను.. వారి ఇళ్లల్లో పరామర్శలకు.. వివాహాలకు మాత్రమే హాజరయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనల సమయంలో సైతం ఆయన హాజరుకావడం లేదు. అదికూడా ఆ పార్టీ గ్రాఫ్ తగ్గించింది. పైగా స్థానికంగా కూడా ఉండడం లేదు. ఇతర రాష్ట్రంలో నాలుగు రోజులు పాటు ఉంటే.. తాడేపల్లి లో మూడు రోజులు గడుపుతున్నారు. వీకెండ్ సర్వీసులు బెంగళూరు నుంచి ఉండడంతో ప్రజలు పెద్దగా నమ్మడం లేదు జగన్మోహన్ రెడ్డిని. అన్నింటికీ మించి వైఫల్యాలను అధిగమించడం లేదు ఆ పార్టీ.
ఎన్నెన్నో అభ్యంతరాలతో..
టిడిపి కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తెస్తోంది. దీనిని ఆహ్వానించడం లేదు జగన్మోహన్ రెడ్డి. విశాఖకు ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. అనుబంధా ఐటీ పరిశ్రమలు వచ్చాయి. అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరిగింది. రాయలసీమలో తయారీ రంగ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. అమరావతిలో అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. వీటికి ఆహ్వానించక పోగా.. భూ సమీకరణ, భూ సేకరణ పేరుతో అడ్డు తగులుతున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇలాంటి కారణాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుంది తప్ప.. ఎంత మాత్రం పెరగడం లేదన్నది విశ్లేషకుల మాట. చూడాలి ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో..
