YSR Congress Party 15 Years Political Journey: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ.. దేశంలోనే ఒక సరికొత్త చరిత్రను తిరగరాసింది. అంతులేని విజయాన్ని చూసింది. అంతే అంతులేని పరాజయాన్ని కూడా చవిచూసింది. ఎలా చూసుకున్నా ఆ పార్టీది రికార్డు బ్రేక్. సాధారణంగా రాజకీయ పార్టీలకు గెలుపు ఓటములు సహజం. కానీ ఏపీలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది ప్రత్యేకం. కేవలం సెంటిమెంట్ పునాదులపై నిర్మించిన పార్టీ అది. రాష్ట్రంలో 50 శాతం మందికి పైగా ఆమోదం పొందింది. అదే సమయంలో 40 శాతం మంది ఆమోదించినా ఆ పార్టీకి అపజయం తప్పలేదు. ఒక రాజకీయ పార్టీ ఎలా ముందుకు వెళ్లాలో తెలుసుకోవచ్చు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా. అదే ఎలా వెళ్ళకూడదు అనేది చెప్పింది కూడా ఆ పార్టీ. ఇలా ఎలా చూసుకున్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే గుర్తింపు సాధించుకుంది.
Also Read: అమాయకంగా ఉండే సంజు శాంసన్.. ఇంతటి కోటీశ్వరుడా? ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా?
* ఆవిర్భావమే ఒక చరిత్ర..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే ఒక తిరుగుబాటు నుంచి ప్రారంభం అయింది. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ప్రకటించబడింది. జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) అప్పటికి కేవలం రెండుసార్లు ఎంపీ మాత్రమే. కానీ ఆయన వెనుకున్న బలం వైయస్ రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంటే పార్టీని అధికారంలోకి తెచ్చారు. పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. అలా పేదల గుండెల్లో నిలిచిపోయారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన పాలనలో ప్రతికూల పరిస్థితులను అధిగమించాయి సంక్షేమ పథకాలు. ఆయన పాలన వైఫల్యాలు కంటే సంక్షేమ పథకాలను గుర్తుపెట్టుకున్నారు ఏపీ ప్రజలు. అటువంటి సమయంలోనే ఆయన హఠాన్మరణం ఏపీని శోకసంద్రంలో ముంచింది. విపరీతమైన సానుభూతి వచ్చింది. అదే సమయంలో తండ్రి వారసత్వ రాజకీయాలను కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ అందుకు అంగీకరించలేదు కాంగ్రెస్ హై కమాండ్. అయితే దానిని సరికొత్త అంశంగా చూపారు జగన్. తన తండ్రి కాంగ్రెస్ పార్టీ కోసం పరితపిస్తే.. కాంగ్రెస్ మాత్రం తన కుటుంబం విషయంలో అమానుషంగా ప్రవర్తిస్తుందన్న కామెంట్స్ ప్రజల్లోకి బలంగా పంపారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టింది కాంగ్రెస్. అసలే రాజశేఖర్ రెడ్డి పై విపరీతమైన అభిమానం పెంచుకున్న ప్రజలు.. ఆయన కుమారుడి పట్ల కాంగ్రెస్ అమానుషంగా ప్రవర్తించిందని భావించారు. అలా జైలుకు వెళ్లి రాజశేఖర్ రెడ్డి పై ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకున్నారు జగన్. సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి తన తండ్రి పేరిట పార్టీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీశారు.
* సరిగ్గా 15 ఏళ్ల కిందట..
2010 నవంబర్ 29న జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. డిసెంబర్ ఏడున కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. 2011 మార్చి 12న తూర్పుగోదావరి జిల్లా( East Godavari district ) వేదికగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రకటించారు. అయితే రాష్ట్ర విభజన జరగడం.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించడం.. అప్పుడే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం ఇలా ఒక్కొక్కటి జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చింది. సెంటిమెంట్ అస్త్రానికి రాష్ట్ర ప్రజలు తలవంచక తప్పలేదు. రాష్ట్ర విభజనతో దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశాదీపం గా మారింది. దాదాపు 80% కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లిపోయారు. సెంటిమెంట్ కాస్త సంప్రదాయ ఓటు బ్యాంకుగా మారింది. 2014 ఎన్నికల్లో 67 సీట్లతో అధికార పార్టీకి ధీటుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనదైన ముద్ర చాటుకుంది. ఏపీ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా మారింది.
* తిరుగులేని శక్తిగా..
2014 నుంచి 2019 మధ్య జగన్ మోహన్ రెడ్డి ఒక సమ్మోహన రాజకీయ శక్తిగా మారారు. అప్పటి టిడిపి ప్రభుత్వానికి( TDP government) వ్యతిరేకంగా ఆయన ఏ కార్యక్రమం చేసినా సక్సెస్. ప్రజలు సైతం జగన్మోహన్ రెడ్డి మాటలకు అమిత ఆసక్తి కనబరిచారు. ప్రజల్లో ఉన్న బలమైన ఆకాంక్షను గుర్తించిన జగన్మోహన్ రెడ్డి 2017లో పాదయాత్రకు సిద్ధపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గాన్ని టచ్ చేసారు. వన్ ఛాన్స్ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దానిని ప్రజలు కూడా బలంగా నమ్మారు. 2019 ఎన్నికల్లో అంతులేని మెజారిటీతో గెలిపించారు. ఏకంగా 151 అసెంబ్లీ స్థానాల్లో, 22 పార్లమెంటు సీట్లలో ఆ పార్టీని గెలిపించారు ఏపీ ప్రజలు. యావత్ భారత దేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు మార్మోగిపోయింది. అంతులేని విజయంతో అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ఏపీలో ఎటువంటి ఎన్నికలు వచ్చినా ప్రత్యర్థులు టచ్ చేయలేనంత స్థితికి వెళ్లారు. కానీ పాలనా వైఫల్యాలను చాలా తేలిగ్గా తీసుకున్నారు. దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు.
* రాజకీయ పోరాటం మారాలి..
2024 సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. 2019లో అంతులేని విజయంతో దేశం తన వైపు చూసేలా చేసుకున్నారు. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి దేశం ఆశ్చర్యపోయేలా అపజయాన్ని సొంతం చేసుకున్నారు.. అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాలను అందుకుంది. పతనాన్ని చవిచూసింది. ఇప్పుడు మరోసారి బలపడేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఇప్పటివరకు ప్రతిపక్షపాత్రను చూశారు ఏపీ ప్రజలు. అధికారపక్షంగా అవకాశం ఇచ్చారు. అయితే మునుపటి మాదిరిగా ఆ పార్టీ రాజకీయాలు చేస్తామంటే కుదరదు. ఎందుకంటే ప్రజలు పాలనను విసిగిపోయి కూటమికి అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం కూటమి పట్ల సానుకూలంగా ఉంది వాతావరణం. ఇటువంటి సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసే రాజకీయాలు నచ్చితేనే ప్రజలు మళ్ళీ ఓటు వేసేది. లేకుంటే మాత్రం ఆ పార్టీకి చాలా కష్టం.