YSR Congress: ప్రతిపక్షంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో మాత్రం నేతల మధ్య ఆధిపత్య పోరు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికీ పదవుల కోసం నేతల మధ్య పోటీ పెరుగుతోంది. ప్రస్తుతం శాసనమండలి లో వైసీపీ పక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ అనారోగ్యానికి గురయ్యారు. మొన్ననే ఆయన బ్రెయిన్ స్ట్రోక్ కు గురైనట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే ఆయనపై స్ట్రెస్ పెరిగిందని.. తగ్గించుకునేందుకు కొద్దిరోజుల పాటు యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంచాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇప్పటికే దీనిపై పార్టీ నాయకత్వానికి ఒక సమాచారం ఉంది. దీంతో శాసనమండలిలో వైసిపి పక్ష నేత పదవి కోసం అప్పుడే ఆ పార్టీ నేతల మధ్య పోరు ప్రారంభం అయ్యింది. ఓ మహిళా నేతతో పాటు గతంలో వైసిపి పక్ష నేతగా వ్యవహరించిన నాయకుడు గట్టిగానే పోటీ పడుతున్నట్లు కనిపిస్తున్నారు.
Also Read: విజయ్–రష్మిక ట్రెండ్ ఫాలో అవ్వలేదు.. సెట్ చేశారంతే!
* దూకుడుగా కళ్యాణి..
శాసనమండలిలో ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు వరుదు కళ్యాణి( Varudu Kalyani) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె పార్టీ వాయిస్ ను గట్టిగానే వినిపిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంలో సక్సెస్ అవుతూ వస్తున్నారు. అందుకే మహిళా నేతగా ఉన్న వరుదు కళ్యాణి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక సానుకూలమైన వాతావరణం ఉంది. శాసనమండలిలో బొత్స సత్యనారాయణ వారసురాలిగా వైసిపి పక్ష నేతగా ఆమెకు చాన్స్ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఆమెకు లేళ్ల అప్పిరెడ్డి నుంచి గట్టిగానే పోటీ ఎదురవుతోంది.
* లేళ్ళ అప్పి రెడ్డి ఆశ
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా( opposition status) కూడా దక్కలేదు. కానీ శాసనమండలలో స్పష్టమైన బలం ఉంది ఆ పార్టీకి. దీంతో అక్కడ ప్రతిపక్ష హోదా దక్కింది. ఈ క్రమంలో మండలిలో వైసీపీ పక్ష నేత పదవి కోసం సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎంతగానో ఆశపడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం లేళ్ల అప్పి రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇంతలో బొత్స విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎన్నిక కావడం.. ఆయనకు మండలి బాధ్యతలు అప్పగించడం జరిగిపోయింది. అయితే ఇప్పుడు బొత్స సత్యనారాయణ అనారోగ్యంతో తప్పుకుంటే తనకే ఛాన్స్ వస్తుందని లేళ్ల అప్పిరెడ్డి భావిస్తున్నారు. మరోవైపు ఈ పదవి కోసం వరుదు కళ్యాణి సైతం పోటీలో ఉన్నారు. ఈ తరుణంలో ఆమెపై లేళ్ల అప్పిరెడ్డి శాసనమండలిలో రుస రుసలాడుతున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.
* నిలదీసినంత పని..
నిన్న శాసనమండలిలో వరుదు కళ్యాణి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. వాయిదా తీర్మానం ఇచ్చిన తర్వాత.. నిర్దేశించిన సమయానికి వరుదు కళ్యాణి రాలేదు. ఎందుకు రాలేదని లేళ్ల అప్పిరెడ్డి గట్టిగానే ప్రశ్నించారు. తాను లేకుండా, తనకు సమాచారం ఇవ్వకుండా వాయిదా తీర్మానం ఎలా ఇచ్చారు అంటూ ఆమె గట్టిగానే ప్రశ్నించారు. దీంతో అప్పిరెడ్డి నీళ్లు నమిలారు. అయితే ఇదంతా వైసీపీ శాసనమండలి పక్ష నేత కోసమేనని అర్థం అవుతోంది.