Gudivada Amarnath: రాజకీయాలు అన్నాక విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. అది సర్వసాధారణం కూడా. అధికార పక్షాన్ని ప్రతిపక్షం విమర్శించాలి. విపక్ష చర్యలను అధికారపక్షం కౌంటర్ ఇవ్వాలి. అయితే ఏపీలో మాత్రం ఈ పరిస్థితి పెద్దగా కనిపించడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షానికి కౌంటర్ ఇవ్వడంలో ఇబ్బంది పడుతోంది. ఆ పార్టీలో సీనియర్లు పెద్దగా మాట్లాడడం లేదు. జూనియర్లు చెబుతున్న మాటలు ప్రజల్లోకి వెళ్లడం లేదు. పైగా ఆ పార్టీకి ఇబ్బందికి గురి చేసి పెడుతున్నాయి. ముఖ్యంగా విశాఖలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. విశాఖలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో అక్కడ అధికారపక్షానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు సీనియర్లు ఎవరు ముందుకు రావడం లేదు. దీంతో గుడివాడ అమర్నాథ్ లాంటి జూనియర్ తో మాట్లాడించి లేనిపోని ఇబ్బందులను తెచ్చి పెట్టుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* రాజకీయ నేపథ్య కుటుంబమైనా..
రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు గుడివాడ అమర్నాథ్. ఆయన తాత గుడివాడ అప్పన్న, తండ్రి గుడివాడ అమర్నాథ్ రాజకీయ వారసత్వంగా.. తనను తాను ప్రూవ్ చేసుకున్నారు గుడివాడ అమర్నాథ్. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఆపై మంత్రిగా కూడా వ్యవహరించారు. అయితే రాజకీయాల్లో ఒక్కసారి పలుచన అయితే తప్పకుండా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అందునా కూడా సీరియస్ గా వ్యవహరించకపోతే సోషల్ మీడియా పుణ్యమా అని మరి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. ఎక్కువగా ట్రోల్స్ చేస్తారు. అందుకే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఈ విషయంలో మాత్రం గుడివాడ అమర్నాథ్ అడ్డంగా బుక్కయ్యారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఆయన చేసిన ప్రకటనలు వికటించాయి. ఆయనను ఒక కోవలో నాయకుడిగా చూస్తారు. అటువంటి నాయకుడితో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిదానికి మాట్లాడిస్తున్నారు.
* ఎనలేని ప్రాధాన్యమిస్తున్న వేళ..
కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్రకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. ప్రధానంగా విశాఖను ఐటి హబ్ గా మార్చాలని చూస్తోంది. పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి. గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. శంకుస్థాపన కూడా పూర్తి చేసింది. రైల్వే ప్రత్యేక జోన్, భోగాపురం ఎయిర్పోర్ట్, మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఇలా చాలావరకు అభివృద్ధి అంటే చేసి చూపిస్తోంది. కానీ ఇటువంటి సమయంలో అదంతా తమ క్రెడిట్ అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. అదే మాటను గుడివాడ అమర్నాథ్ లాంటి నేతలతో మాట్లాడిస్తుంది. అయితే ఈ ప్రాజెక్టుల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాత్ర ఉండవచ్చు. కానీ గుడివాడ అమర్నాథ్ లాంటి వారు చెబుతుండడం మాత్రం నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే గుడివాడ అమర్నాథ్ అంటేనే ఒక రకమైన భావన ఏర్పడింది. అటువంటి వారితో మాట్లాడించడం ఏంటి అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి.