Kavitha Vs Sharmila Politics: తెలుగు నాట వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ, గులాబీ పార్టీల మధ్య స్నేహం గురించి అందరికీ తెలిసిందే. పరస్పరం ప్రయోజనాల కోసం రిటర్న్ గిఫ్టులు పంపుకున్నాయి ఆ పార్టీలు. అయితే ఎల్లకాలం అవి పని చేయవు. అందుకే రిటర్న్ గిఫ్టులు కాస్త వికటించి.. రెండు పార్టీలు ఓటమి చెందాయి. ఆ రెండు పార్టీలకు ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎదురు తిరిగారు. తోబుట్టువులే ప్రత్యర్ధులుగా మారిపోయారు. అయితే ఇప్పుడు ఆ రెండు పార్టీలకు కష్టాలు తప్పడం లేదు ఆడపడుచుల నుంచి. అందుకే అయోమయంలో పడ్డాయి. రాజశేఖర్ రెడ్డి ఉన్నంతకాలం కెసిఆర్ ఆయనతో విభేదించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయనకు నమ్మదగిన మిత్రుడిగా మారిపోయారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చేలా చేశారు కేసీఆర్. అందుకు ప్రతిగా జగన్ అధికారంలోకి వచ్చిన వారం రోజులలోనే హైదరాబాదులో ఉన్న ఏపీ ఉమ్మడి ఆస్తులను ఒకే ఒక్క సంతకంతో తెలంగాణకు ధారా దత్తం చేశారు.
* రెండు పార్టీలకు ఒకే మాదిరిగా..
అయితే కష్టాలు చెప్పి వచ్చాయో.. చెప్పకుండా వచ్చేయో తెలియదు కానీ ఆ రెండు పార్టీలు అధికారానికి దూరమయ్యాయి. అయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డికి కాస్త ముందుగానే చెల్లెలు షర్మిల సెగ తగిలింది. ఎంతలా అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని షర్మిల పోరాటం చేసేదాకా. కానీ తెలంగాణలో మాత్రం అలా కాదు. గులాబీ పార్టీ ఓడిపోయిన తర్వాత వారసత్వం కోసం జరిగిన పోరాటంలో కవిత పక్కకు వెళ్లిపోయారు. పక్కలో బల్లెం లా మారిపోయారు. సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి ఇప్పుడు గులాబీ పార్టీకే సవాల్ విసురుతున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా ఆ రెండు పార్టీలు వచ్చేది మేమే.. అధికారం చేపట్టేది మేమే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
* రెండు పార్టీల రిటర్న్ గిఫ్టులు..
అయితే ఒక్క విషయం మాత్రం ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తోంది. ఆ ఇద్దరు మహిళ నేతలను టార్గెట్ చేసుకుంటున్నాయి రెండు పార్టీల సోషల్ మీడియాలు. అయితే అది నేరుగా కాదు. ఇప్పటివరకు పరస్పర రాజకీయ ప్రయోజనాలకు పని చేసిన ఆ రెండు పార్టీలు ఇప్పుడు.. ఆడపడుచులను టార్గెట్ చేసుకోవడంలో సైతం పరస్పరం సహకారం అందించుకుంటున్నాయి. ప్రస్తుతం కవితను టార్గెట్ చేసే పనిలో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. షర్మిలను టార్గెట్ చేస్తోంది గులాబీ పార్టీ సోషల్ మీడియా. ఇక్కడ కూడా రిటర్న్ గిఫ్టులు పంపించుకోవడం గమనార్హం.