YS Sharmila: వైయస్ షర్మిల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆవేదనతో ఉన్నారా? తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారా? తనకు రాజ్యసభ పదవి ఇవ్వకపోవడంపై కొందరి హస్తం ఉందన్న అనుమానాలు ఆమెలో ఉన్నాయా? అందుకే ఇండియా కూటమి సమావేశానికి ఆమె గైర్హాజరయ్యారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల కిందట కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిలను ఎంపిక చేస్తారన్న ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆమెను ఢిల్లీ పిలిచి కాంగ్రెస్ అగ్ర నేతలు అభయం కూడా ఇచ్చారట. కానీ ఇంతలోనే సమీకరణలు మారిపోయాయి. చివరి నిమిషంలో షర్మిల పేరు లేకుండా పోయింది. అయితే కాంగ్రెస్ పార్టీ కోసం తాను నిలబడితే.. పార్టీ మాత్రం ఇచ్చిన మాట కట్టుబడి ఉండలేదన్న ఆవేదన షర్మిల లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ బాధతోనే రెండు రోజుల కిందట ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి ఆమె గైర్హాజరైనట్లు తెలుస్తోంది.
* అప్పట్లో హామీ..
2024 ఎన్నికలకు ముందు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నారు షర్మిల. తెలంగాణలో తన తండ్రి పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. కానీ వర్కౌట్ కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు తన పార్టీని. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గంలో నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఏపీలో పార్టీ బాధ్యతలు తీసుకుంటే రాజ్యసభకు అవకాశం ఇస్తామని.. అది కూడా కర్ణాటక నుంచి ఛాన్స్ కల్పిస్తామని అప్పట్లో అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ హామీ ఇచ్చారు. అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆమె కృషి చేస్తూ వచ్చారు. కర్ణాటక నుంచి రాజ్యసభ పదవులు ఖాళీ అయ్యాయి. అక్కడినుంచి ఛాన్స్ దక్కుతుందని భావించారు షర్మిల. అందుకు తగ్గట్టుగానే ఢిల్లీ నుంచి సమాచారం రావడంతో వెళ్లి వచ్చారు. నామినేషన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్ హై కమాండ్ హ్యాండిచ్చింది. అయితే ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ద్వారానే.. తనకు రాజ్యసభ పదవి రాకుండా కుట్ర జరిగిందన్నది షర్మిల లో ఉన్న అనుమానం.
* జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారని..
ప్రధానంగా కర్ణాటక కాంగ్రెస్ నేతలతో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆయన బెంగుళూరులో తన రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అన్న ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు అదే కర్ణాటక కాంగ్రెస్ నేతలతో కలిసి జగన్మోహన్ రెడ్డి తనకు రాజ్యసభ పదవి రాకుండా అడ్డుకున్నారన్న అనుమానం షర్మిల లో ఉంది. ఇదే విషయాన్ని పరోక్షంగా ఇటీవల ఆమె ఒక ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. పైగా జగన్మోహన్ రెడ్డిని మచ్చిక చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న అనుమానాలు కాంగ్రెస్ హై కమాండ్ పై ఉన్నాయి. ఈ అనుమానాలతోనే ఆమె కాంగ్రెస్ హై కమాండ్ పై రగిలిపోతున్నారు. అందుకే కీలకమైన ఇండియా కూటమికి గైర్హాజరయ్యారు. ఇదే పరిణామాలు కొనసాగితే షర్మిల తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

