YS Jagan Mohan Reddy: విశాఖ జిల్లాలో ( Visakha district ) పట్టు కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయనకు విశాఖ విషయంలో అసంతృప్తి ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి అన్ని ప్రాంతాల్లో సత్తా చాటింది. కానీ విశాఖ నగరంలో మాత్రం ఆ నాలుగు సీట్లలో కనీసం ఉనికి చాటుకోలేకపోయింది. గెలిచేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఎందుకో గెలవలేకపోయింది. 2014లో విశాఖ జిల్లాలో మిశ్రమ ఫలితాలను చూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. 2019లో అయితే విశాఖ రూరల్ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. 2024 ఎన్నికల్లో అయితే డిజాస్టర్ ఫలితాలను చవిచూసింది. మొత్తం మూడు ఎన్నికలకు గాను నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో సత్తా చాటలేకపోయింది. నిజంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద లోటు.
Also Read : కూటమి ప్రయత్నానికి వైఎస్సార్ కాంగ్రెస్ చెక్!
* పట్టు చిక్కని ఆ నాలుగు..
విశాఖ నగరంలో( City) నాలుగు నియోజకవర్గాలు ఉంటాయి. తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర నియోజకవర్గాలు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ నాలుగు నియోజకవర్గాల్లో విజయం కోసం జగన్ చేయని ప్రయత్నం అంటూ లేదు. 2014, 2019 ఎన్నికల్లో ఈ నాలుగు స్థానాలు టిడిపి ఖాతాలో పడ్డాయి. అయితే ఈసారి పొత్తులో భాగంగా టిడిపి ఖాతాలో రెండు.. జనసేనకు ఒకటి, బిజెపికి ఒకటి దక్కాయి. అయితే ఇక్కడ పట్టు కోసం తాజాగా వ్యూహాలు రూపొందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. విశాఖ టీం తో సరిపోదని భావించి విజయనగరం టీంను బరిలో దించారు.
* భారీ వ్యూహంతోనే నియామకాలు..
జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) విశాల దృక్పథంతోనే.. భారీ వ్యూహంతోనే బొత్స సత్యనారాయణను విశాఖలో ఎంట్రీ ఇచ్చారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. అదే సమయంలో మరో మాజీమంత్రి కురసాల కన్నబాబును ఉత్తరాంధ్ర నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. ఈ రెండు నియామకాలు పక్కా ప్లాన్ తో జరిగినట్లు సమాచారం. ఈ రెండు ఎంపికల వెనుక విశాఖ నగరంలో పట్టు సాధించాలన్నది వ్యూహంగా తెలుస్తోంది.
* రూరల్ కు అమర్నాథ్ షిఫ్ట్..
ఇంకోవైపు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను( Gudivada Amarnath) నగరం నుంచి రూరల్ కు పంపించేశారు. ఇప్పుడు నగర అధ్యక్షుడిగా సమర్థవంతమైన నేత కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో వెలమ సామాజిక వర్గానికి చెందిన తైనాల విజయకుమార్ కు నగర పార్టీ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్లు సమాచారం. కాపు, వెలమ ఫార్ములాతో విశాఖ నగరంలో పట్టు సాధించాలన్నది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. ఇప్పటివరకు రీజనల్ కోఆర్డినేటర్లుగా తన సామాజిక వర్గాన్ని నియమించడం మైనస్ గా మారిందని గుర్తించారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ కొత్త సామాజిక వర్గాల ఫార్ములా ను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.
Also Read : మూడేళ్లు ఆగు.. సెల్యూట్ చేయిస్తా.. బాధితుడికి జగన్ భరోసా