Homeఆంధ్రప్రదేశ్‌Siddam Sabha: సిద్ధం సభలకు ప్రత్యర్థుల పొత్తు గండం

Siddam Sabha: సిద్ధం సభలకు ప్రత్యర్థుల పొత్తు గండం

Siddam Sabha: ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలను ఆర్భాటంగా ప్రారంభించారు. సిద్ధం పేరిట భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. లక్షలాదిమంది జనాలను సమీకరించి క్యాట్ వాక్ తరహాలో ఈ సభలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మూడు సభలు పూర్తయ్యాయి. ఉత్తరాంధ్రలో భీమిలి, గోదావరి జిల్లాలో ముమ్మిడివరం, రాయలసీమ జిల్లాలో రాప్తాడులో సిద్ధం సభలు పూర్తయ్యాయి. షెడ్యూల్ ప్రకారం గత నెలలో నాలుగో సభ నిర్వహించాల్సి ఉంది. కానీ రకరకాల కారణాలు చూపుతూ సిద్ధం సభను వాయిదా వేస్తూ వచ్చారు. ఈ నెల 10న జరగాల్సిన సిద్ధం సభను సైతం వాయిదా వేశారు. టిడిపి,జనసేన, బిజెపి పొత్తుల ఎఫెక్ట్ తోనే ఈ సభ వాయిదా పడినట్లు తెలుస్తోంది.సిద్దం పేరుతో నిర్వహిస్తున్న సభలను అనుకున్న సమయానికి నిర్వహించడానికి వైసిపి తంటాలు పడుతోంది. ప్రతి సభ వాయిదా పడుతూనే ఉంది.

ఈనెల 10న మేదరమెట్లలో సిద్ధంసభకు వైసిపి అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు 15 లక్షల మంది వస్తారంటూ విజయసాయిరెడ్డి ప్రతిరోజు ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. కానీ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ఈ నెల 19 కి సిద్ధం సభను వాయిదా వేశారు. ఈ సభలోనే అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో విడుదల చేయాలని భావిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఆ కసరత్తు పూర్తి కానట్లు తెలుస్తోంది. ఇప్పటికే చేయూత పథకానికి జగన్ బటన్ నొక్కారు. రెండు వారాలపాటు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు పడుతుందని చెప్పుకొచ్చారు. కానీ ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సిద్ధం సభలో మరికొన్ని సంక్షేమ పథకాలను ప్రకటించడానికి సిద్ధపడుతున్నారు. మరికొన్ని పథకాలకు జీవోలు విడుదల చేయాలని భావిస్తున్నారు. కానీ వీటన్నింటికీ ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. సిద్ధం సభ వాయిదా వేయడానికి ఇది ఒక ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ప్రస్తుతం బిజెపితో పొత్తు వ్యవహారం తేలుతోంది. చంద్రబాబుతో పాటు పవన్ ఢిల్లీ వెళ్లి అగ్రనేతలతో సమావేశం అవుతున్నారు. టిడిపి ఎన్డీఏలో ఎంట్రీ లాంఛనమే. అదే జరిగితే జగన్ కు ద్వారాలు మూసినట్టే. కేంద్ర ప్రభుత్వపరంగా సహకారం ఉండదు. ఎన్డీఏ భాగస్వామి పక్షాలుగా టిడిపి, జనసేన ఉండడం వల్ల వైసీపీకి సహాయ నిరాకరణ తప్పదు. ఇప్పటికే టిడిపి, జనసేన సంయుక్తంగా ఎన్నికల ప్రచార సభలను నిర్వహిస్తూ వస్తున్నాయి. ఢిల్లీలో పొత్తు అంశం తేలాక మూడు పార్టీలు రంగంలోకి దిగనున్నాయి. చంద్రబాబు,పవన్ తో పాటు బిజెపి అగ్ర నేతలు సైతం ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనున్నారు. అదే జరిగితే ఎన్నికల ప్రచారంలో జగన్ వెనుకబడినట్టే. మొత్తానికైతే సిద్ధం సభలతో రాష్ట్రం మొత్తం చుట్టేయాలని భావిస్తున్న జగన్ కు రాజకీయ పరిణామాలు అద్దంకిగా మారుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version