YSRCP Kapu Vote Bank: పవన్ కళ్యాణ్ ఏపీలో కుల దరిద్రం గురించి మాట్లాడుతున్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ కులాల మధ్య కుంపట్లు ఏంటని ప్రశ్నిస్తున్నారు. కులం విషయంలో చాలా స్పష్టంగా చెబుతున్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కులం అనే దానిని హైలెట్ చేస్తోంది. ఆ పార్టీకి చెందిన కాపు నేతలు ఏకంగా ఆత్మీయ సమావేశాలు పేరుతో రాజకీయం చేస్తున్నారు. పవన్ ఒకవైపు కుల రాజకీయాలు వద్దు అంటే.. ఇదిగో మేం చేసి చూపిస్తున్నాం అంటున్నట్టు చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ భిన్నమైన వైఖరిని గమనిస్తున్నారు ఏపీ ప్రజలు. ప్రధానంగా తమ సామాజిక వర్గాన్ని బూచిగా చూపి చేస్తున్న రాజకీయాన్ని కాపులు నిశితంగా గమనిస్తున్నారు. ఇప్పుడిప్పుడే వారికి ఒక క్లారిటీ వస్తోంది.
ధైర్యం చేసిన పవన్..
అయితే రాష్ట్రంలో ఎవరు చేయని ధైర్యం పవన్ కళ్యాణ్ చేశారు. పవన్ కళ్యాణ్ ను కాపుల ప్రతినిధిగా చూస్తున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. కాపుల ద్వారానే ఆయన రాజకీయం చేస్తున్నారని.. కాపులు ఆయనకు అండగా నిలుస్తున్నారని… అలా కాపులు కూటమికి దగ్గరయ్యారని.. పవన్ కళ్యాణ్ కు కాపులు నమ్మితే చంద్రబాబును సీఎం చేస్తున్నారంటూ ఇప్పుడు వైసీపీ నేతలు అంటున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ కుల దరిద్రం వద్దని హెచ్చరిస్తున్నారు. క్రిమినల్ ను వెనుకేసుకు రావాలా అంటూ సాయి కృష్ణ ఉదంతాన్ని ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించేందుకు చాలా ధైర్యం కూడా ఉండాలి. ఎందుకంటే పవన్ వాస్తవాలను నొక్కి చెబుతున్నారు. ఇటీవల సాయికృష్ణ అదృశ్యం అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టించుకోవడంలేదని వైసీపీ కాపు నేతలు ప్రశ్నించడాన్ని ఇప్పుడు గుర్తించుకోవాలి.
కాపుల చుట్టూనే రాజకీయం..
కాపులు చుట్టూ జరుగుతున్న రాజకీయాన్ని ఒక్కసారి గమనిస్తే ఇట్టే అర్థం అవుతుంది. తాను కాపులకు మాత్రమే ప్రతినిధిని కానని.. అలా ఒక కులం ముద్ర వేస్తే ఊరుకునేది లేదన్నట్టు పవన్ మాట్లాడుతున్నారు. కాపులంతా పవన్ కళ్యాణ్ ను నమ్మితే ఆయన చంద్రబాబును సీఎం చేస్తున్నారు అంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏ చిన్న ఘటన జరిగినా.. అది కాపులకు సంబంధించినది అయితే పవన్ కళ్యాణ్ కు ముడి పెడుతున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు అంటూ పవన్ వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. నేను కుల రాజకీయాలు చేయడం లేదు కదా అని నిలదీసినంత పని చేస్తున్నారు. ఒక క్రిమినల్ కాపు కులస్తుడైతే.. రోడ్డు మీదకు వచ్చి దౌర్జన్యం చేస్తే ఊరుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం లేదు. పవన్ కళ్యాణ్ కు కుల అభిమానం అంటూ ప్రత్యేకంగా లేదు. అలాగని చెప్పి పవన్ కళ్యాణ్ పట్ల కాపులు అభిమానం చూపకుండా ఉండలేకపోతున్నారు. మాపై అభిమానం చూపండి అంటూ వైసీపీ కాపు నేతలు కాపు సామాజిక వర్గాన్ని కోరుతున్నారు. కూటమికి ఓటు వేస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబును సీఎం చేస్తున్నారని చెబుతున్నారు. వైసీపీకి ఓటు వేస్తే జగన్మోహన్ రెడ్డి కాదు తామే సీఎం అవుతామని చెప్పలేకపోతున్నారు. తాము సైతం జగన్మోహన్ రెడ్డి కోసమే ఈ కాపు రాజకీయం చేస్తున్నామన్న విషయాన్ని కాపు నేతలు గ్రహించడం లేదు. ఎంతవరకు కాపులు కూటమికి అండగా నిలబడితే అది చంద్రబాబుకు ప్రయోజనం అని చెబుతున్నారు. మరి వైసీపీకి ఓటు వేస్తే తమకంటే జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం అన్న విషయాన్ని బాహాటంగా ఒప్పుకోవడం లేదు. ఫైనల్ గా తమ చుట్టూ జరుగుతున్న రాజకీయం.. తమ గురించి ఏపీ ప్రజల్లో బలమైన చర్చ జరుగుతోందని మాత్రం కాపులు కాస్త సంతృప్తి పడుతున్నారు. అంతకుమించి ఏమీ జరగడం లేదు.
