Khawaja Latest Comments: ఆపరేషన్ సిందూర్తో చావు తప్పి కన్ను చొట్టబోయిన చందంగా మారింది పాకిస్తాన్ పరిస్థితి. ఇప్పటికీ భారత్ దాడిలో దెబ్బతిన్న పోర్టులకు మరమ్మతులు కూడా చేసుకోలేక ప్యాచ్లు వేసుకుంటోంది. ఐదు రోజుల దెబ్బే ఇలా ఉంటే.. మరి పూర్తి యుద్ధం చేస్తే ప్రపంచ పటంలో ఆ దేశం మాయం అవుతుంది. అయినా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కారు కూతలు కూస్తున్నాడు. ఇటీవల చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచాయి. భారత్ పాకిస్తాన్కు వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గించినా లేదా అడ్డుకున్నా, అది జాతీయ భద్రతా సమస్యగా మారుతుందని స్పష్టం చేశారు. పాకిస్తాన్ వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థ, కోట్లాది ప్రజల జీవనాధారం సింధూ నదీ వ్యవస్థపై ఆధారపడి ఉందని గుర్తు చేశారు. నీటి హక్కులను రక్షించుకోవడానికి అన్ని మార్గాలు వాడతామని, అవసరమైతే యుద్ధం వరకు వెళ్లడానికి వెనకాడమని హెచ్చరించాడు.
ఒప్పందంలో ఏముంది..
1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. సింధూ నదీ వ్యవస్థలోని ఆరు ప్రధాన నదులను రెండు భాగాలుగా విభజించారు. రవి, బియాస్, సట్లెజ్ నదుల జలాలపై భారత్కు పూర్తి హక్కులు ఇచ్చారు. ఇండస్, జీలం, చీనాబ్ నదుల జలాలను ప్రధానంగా పాకిస్తాన్ వినియోగించుకునేలా నిర్ణయించారు. అయినప్పటికీ పశ్చిమ నదులపై విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి అవసరాల కోసం భారత్కు కొన్ని పరిమిత హక్కులు కల్పించారు. ఆరు దశాబ్దాలుగా యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు ఉన్నా ఈ ఒప్పందం కొనసాగడం గమనార్హం.
జలవిద్యుత్ ప్రాజెక్టులపై పాక్ అభ్యంతరం..
జమ్మూ–కశ్మీర్ ప్రాంతంలో భారత్ చీనాబ్, జీలం నదులపై జలవిద్యుత్ ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది. ఇవి ఒప్పంద నిబంధనలకు విరుద్ధమని పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారత్ మాత్రం ఈ ప్రాజెక్టులు ఒప్పందం పరిధిలోనే ఉన్నాయని, నీటిని మళ్లించడం లేదా అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేస్తోంది. తమకు లభించిన హక్కులను పూర్తిగా వినియోగించుకోవడం బాధ్యత అని భారత్ వాదిస్తోంది.
ఇటీవల భారత్లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ఈ ఒప్పందంపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి. గతంలో చేసిన ‘‘రక్తం, నీరు ఒకేసారి ప్రవహించలేవు’’ అనే వ్యాఖ్య మళ్లీ ప్రస్తావనకు వచ్చింది. పాకిస్తాన్లో ఉగ్రవాదం కొనసాగితే ఒప్పందంపై పునఃసమీక్ష అవసరమని భారత రాజకీయ వర్గాల్లో అభిప్రాయం బలపడుతోంది. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.
