YSRCP targeting BR Naidu: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు ఒక మహిళ తో సన్నిహితంగా ఉన్నారు. ఆమెతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఎందుకు ఉన్నారు? ఆయనకు ఆస్థానంలో ఉండే అధికారం లేదు. అసలు ఆయనకు ఆ అర్హత కూడా లేదు.. చంద్రబాబు నాయుడు వెంటనే ఆయనను ఆస్థానం నుంచి తొలగించి.. వేరే వ్యక్తితో భర్తీ చేయాలి.. ఇదీ నిన్నటి నుంచి వైసీపీ.. దాని అనుబంధ సోషల్ మీడియా.. పార్టీ నాయకులు చేస్తున్న డిమాండ్.
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించక ముందే వైసిపి దాడి మొదలుపెట్టింది. బిఆర్ నాయుడుకు టిటిడి చైర్మన్ గా ఉండే కనీస అర్హత లేదన్నట్టుగా వార్తలను ప్రచురించింది. కథనాలను ప్రసారం చేసింది. కానీ, చంద్రబాబు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. బిఆర్ నాయుడికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో భక్తులు చనిపోయినప్పుడు కూడా.. చంద్రబాబు బీ ఆర్ నాయుడు విషయంలో వెనక్కి తగ్గలేదు. ఆయనను పూర్తిగా నమ్మారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేశారు.
అయినప్పటికీ వైసీపీ బీఆర్ నాయుడును వదిలిపెట్టలేదు. బి ఆర్ నాయుడు కుమారుడు మాదకద్రవ్యాల వ్యవహారంలో ఉన్నారన్నట్టుగా ప్రచారం చేసింది. అప్పట్లో ఈ వ్యవహారాన్ని తన అనుకూల మీడియాలో వైసిపి విపరీతంగా సర్కులేట్ చేసింది. కానీ చివరికి తెలంగాణ
పోలీసులు ఈ వ్యవహారంలో బిఆర్ నాయుడు కుమారుడి పాత్ర లేదని తేల్చారు. అయినప్పటికీ వై వి సుబ్బారెడ్డి.. కరుణాకర్ రెడ్డి బి ఆర్ నాయుడు మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు.
తాజాగా ఈ వీడియోను బయటికి వదిలారు. ఆ వీడియో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుండగానే.. వైసిపి నాయకులు తెరమీదకి వచ్చారు. ఇష్టానుసారంగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో నాయుడు అనేక రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గతంలో భక్తుల ఆదరణ పొందిన కార్యక్రమాలను మళ్లీ మొదలుపెట్టారు. దర్శనం.. భక్తులకు కల్పించే వసతులు.. అన్నదానం.. ప్రసాదం.. ఇతర వ్యవహారాలలో కచ్చితంగా వ్యవహరిస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న అన్యమతస్తులైన అధికారులను బయటకు పంపిస్తున్నారు. నిక్కచ్చిగా పనిచేసే ఉద్యోగులను నియమించుకుంటున్నారు. దీంతో వైసిపి పరిపాలనలో జరిగిన అక్రమాలు మొత్తం బయటపడుతున్నాయి. ఇప్పటికే లడ్డు వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీన్ని మర్చిపోకముందే బంగారు తాపడం విషయంలోనూ అక్రమాలు జరిగాయని వెలుగులోకి వచ్చింది. బీ ఆర్ నాయుడు కచ్చితంగా వ్యవహరించడం వల్లే ఆయన మీద వైసిపి కక్ష కట్టిందని కూటమినేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు బీఆర్ నాయుడు ఇప్పటికే వైసిపి నేతల మీద కోర్టు దాకా వెళ్లారు. ఫిర్యాదులు కూడా చేశారు. తదుపరి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.