Kadambari Jethwani: కాదంబరి జెత్వానీ ఎవరు? ఆమె చుట్టు వివాదాలేంటి? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

ఏపీలో రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. అదే సమయంలో కొన్ని కీలక కేసులు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు హాట్ టాపిక్ గా మారుతోంది.

Written By: Dharma, Updated On : August 31, 2024 4:39 pm

Kadambari Jethwani(4)

Follow us on

Kadambari Jethwani: కాదంబరి జెత్వానీ.. ప్రస్తుతం ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతోంది.జస్టిస్ ఫర్ జెత్వానీ పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. వైసిపి ప్రభుత్వ హయాంలో ఆమెపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించారన్నది ప్రధాన ఆరోపణ. ఓ పారిశ్రామికవేత్త కోసం అప్పటి ప్రభుత్వ పెద్దలు, ముగ్గురు ఐపీఎస్ అధికారులు రంగంలోకి దిగి బాధితురాలితో పాటు ఆమె కుటుంబానికి చిత్రహింసలకు గురిచేశారన్నది వెలుగు చూసిన అంశం.దీనిపై బాధితురాలు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసు ఉన్నత స్థాయి బృందం రంగంలోకి దిగింది.దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఎవరు కాదంబరి జెత్వానీ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారుతోంది.కాదంబరి జెత్వానీ గుజరాతి కుటుంబానికి చెందిన యువతి. 1996 ఏప్రిల్ 20న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పుట్టిందామె. తండ్రి నేవీ ఆఫీసర్. తల్లి ఆర్బిఐ మేనేజర్. 12 సంవత్సరాల వయసులోనే ఏడేళ్ల భరతనాట్యం కోర్సును పూర్తిచేసి సర్టిఫికెట్ అందుకుంది. అహ్మదాబాద్ లో ఉన్న ఎస్ఎంటి ఎన్ హెచ్ ఎల్ మున్సిపల్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబిబిఎస్ డిగ్రీ అందుకుంది. ఆర్బిఐ లో పనిచేస్తున్న తల్లికి ముంబై ట్రాన్స్ఫర్ కావడంతో అక్కడికి షిఫ్ట్ అయ్యారు.

* హిందీలో తొలి అరంగేట్రం
అందం, అభినయం, ఆపై డాక్టర్ కావడంతో.. సినీ రంగంలో అడుగు పెట్టాలని కాదంబరి జెత్వానీ భావించారు. సినీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. తొలిసారిగా సడ్డా అడ్డా అనే హిందీ సినిమాలో లీడ్ రోల్ చేసే పాత్రను దక్కించుకున్నారు. ఆ సినిమాతోనే బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. 2014లో ఓయిజా అనే కన్నడ సినిమాలో నటించారు. తెలుగులో ఆట అనే సినిమాలో పరిచయమయ్యారు. మలయాళం లో ఐ లవ్ మీ, పంజాబీలో ఓ యారా ఐన్వయి ఐన్వయి లుట్ గయా అనే సినిమాలో నటించారు. అయితే సినిమాల్లో పెద్దగా రాణించలేకపోయారు. అప్పుడప్పుడు తన ఇన్ స్టా ఖాతాలో లేటెస్ట్ ఫోటోలు, సోషల్ సర్వీస్ ఫోటోలు షేర్ చేస్తుంటారు.

* సజ్జన్ జిందాల్ తో ప్రేమాయణం
అయితే పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ తో ప్రేమాయణం నడిపారని ప్రచారం జరిగింది. అయితేకాదంబరి జెత్వానీతో వివాహానికి జిందాల్ కుటుంబం అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సజ్జన్ జిందాల్ వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో ఆమె న్యాయ పోరాటానికి దిగారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేషన్ లో 2023 డిసెంబర్ 17న కేసు పెట్టారు. తనను ప్రేమ పేరుతో మోసగించారన్నది ఈ ఫిర్యాదు సారాంశం. అప్పట్లో ఇది పెను దుమారానికి దారితీసింది. అక్కడి మీడియాలో ప్రధానాంశంగా మారింది.

* ఏపీ పెద్దల ఆశ్రయం
అయితే ఈ కేసు విషయంలో ఏపీ ప్రభుత్వ పెద్దలను సజ్జన్ జిందాల్ ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అప్పటికే ఏపీలో జిందాల్ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 29న సజ్జన్ జిందాల్ తాడేపల్లి లో సీఎం జగన్ ను కలిశారు. అయితే అక్కడికి కొద్ది రోజులు పోయిన తర్వాత.. 2024 ఫిబ్రవరి 2న కృష్ణా జిల్లాకు చెందిన వైసిపి నేత కుక్కల విద్యాసాగర్ ఆమెపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు చెందిన భూమిని నకిలీ ధ్రువపత్రాలతో ఆమె అమ్మకానికి ప్రయత్నించారన్నది ఆ ఫిర్యాదు సారాంశం. అయితే ఆ తరువాత రోజునే విజయవాడ పోలీసులు ముంబై వెళ్లి ఆమెతో పాటు కుటుంబ సభ్యులను విజయవాడ తీసుకొచ్చారు.

* తప్పుడు కేసుతో జైలుకు
సజ్జన్ జిందాల్ పై కేసు విత్ డ్రా చేసుకుంటే పెద్ద మొత్తంలో నగదు ఇస్తామని.. ఐదు కోట్ల రూపాయలు అందిస్తామని పోలీసు అధికారులు సెటిల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వ పెద్ద ఒకరు చొరవ తీసుకున్నట్లు సమాచారం. అయితే అందుకు కాదంబరి జెత్వానీ అంగీకరించలేదు. దీంతో చీటింగ్ కేసులో ఆమెను కస్టడీకి తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా కుటుంబం భయపడిపోయింది. సజ్జన్ జిందాల్ పై పెట్టిన కేసును విత్ డ్రా చేసుకునేందుకు సమ్మతించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెకు ఫిబ్రవరి 14న బెయిల్ లభించింది. మార్చి 15న ముంబై పోలీసులు అక్కడ కేసును క్లోజ్ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఇప్పుడు బాధితురాలు కాదంబరి జెత్వానీ నేరుగా ఫిర్యాదు చేయడంతో.. కేసు దర్యాప్తు శరవేగంగా ముందుకు సాగుతోంది.