Modi impressed with Lokesh: వారసత్వం అనేది కేవలం పరిచయం చేసేందుకు మాత్రమే అక్కరకు వస్తుంది. వారసులు తమకు తాము ప్రూవ్ చేసుకోకపోతే రాణించలేరు కూడా. అయితే ఇప్పుడు ప్రతికూల పరిస్థితుల నడుమ రాజకీయ వారసుడిగా వచ్చిన లోకేష్ చాలా ఇబ్బందులు పడ్డారు. రాజకీయ ప్రత్యర్థుల చేతిలో వ్యక్తిత్వ హననానికి గురయ్యారు. కానీ అదే లోకేష్ ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో కీర్తించబడుతున్నారు. అది చిన్న విషయం కాదు.. రాజకీయాల కోసమో.. రాజకీయ మద్దతు కోసమో.. ప్రధాని నరేంద్ర మోడీ ఏ నేతను కూడా ప్రశంసించరు. ఆయన ప్రశంసించారంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. ఇప్పుడు నారా లోకేష్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ చాలా అనుకూలంగా ఉన్నారు. రాజకీయ వర్గాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.
గంటన్నరకు పైగా..
హైదరాబాద్ పర్యటనకు వచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లి దాదాపు గంటన్నర పాటు గడిపారు. ప్రధాని ఎక్కువగా లోకేష్ తో సమకాలిన రాజకీయాలు, ప్రపంచ పరిణామాలు, మారుతున్న యువత ఆలోచన ధోరణి పై సుదీర్ఘంగా చర్చించడం.. వారి మధ్య బలమైన అనుబంధానికి నిదర్శనం. లోకేష్ ను అభినందించడం ప్రధానికి కొత్త కాదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఆయనను ప్రశంసిస్తూనే ఉన్నారు. అందుకే ఆ కుటుంబానికి ప్రత్యేక విందు ఆహ్వానం కూడా పలికారు అప్పట్లో. అందుకే లోకేష్ సతీ సమేతంగా ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోడీతో విందు భేటీ జరిగింది. లోకేష్ పనితీరులో ప్రధాని మోదీని ఆకట్టుకున్నది ఆయన పనితనం. కేవలం ప్రణాళికలు రచించడం కాదు.. వాటిని 100% విజయవంతంగా అమలు చేసే తీరు ఆకట్టుకుంటూ వస్తోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ఏర్పాట్లను చూసి ప్రధాని ఫిదా అయ్యారు. దానిపై ఒక పుస్తకాన్ని సిద్ధం చేయించి సహచర క్యాబినెట్ మంత్రులకు ప్రధాని ఇచ్చారంటే లోకేష్ విషయంలో ఎంతలా ఆసక్తిగా ఉన్నారు అర్థం అవుతోంది.
ప్రత్యేకంగా ఢిల్లీకి ఆహ్వానం..
ప్రధానిని కలవాలంటే చాలా రకాల తతంగం ఉంటుంది. అటువంటిది లోకేష్ కు ప్రత్యేకంగా ఆహ్వానించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన కుటుంబంతో కలిసి భోజనం చేసేందుకు రెండు గంటలకు పైగా సమయాన్ని కేటాయించారు. లోకేష్ మిత్రపక్ష నేత కావచ్చు కానీ.. దేశంలో చాలామంది యువ నేతలు మిత్రపక్ష పార్టీలకు చెందినవారు. కానీ ఎవరికి ఇవ్వనంత ప్రాధాన్యం లోకేష్ కు దక్కుతోంది ప్రధాని నరేంద్ర మోడీ వద్ద. యువ నేతలతో ఉండాల్సిన అసలైన రాజకీయ పరిణితి లోకేష్ లో ఉందన్న విషయాన్ని గ్రహించారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే లోకేష్ ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలి అన్న ఆలోచన నరేంద్ర మోడీ చేసిన ఆశ్చర్యపడనవసరం లేదు.