Vinutha Case PS Report: మన వండుకునే కూరగాయలనే ఒకటికి రెండుసార్లు పరీక్షించి కొనుగోలు చేస్తాం. పుచ్చులున్నాయా? ఇంకా ఏమైనా మరకలు ఉన్నాయా? అని పరిశీలించిన తర్వాత కొనుగోలు చేస్తాం.. వండుకునే కూరగాయల విషయంలోనే అంత నిక్కచ్చిగా ఉంటే.. మనల్ని పాలించే రాజకీయ నాయకుల విషయంలో ఇంకెంత ఖచ్చితత్వంతో ఉండాలి.. కానీ ఇవేవీ జనాలు చూడటం లేదు. రాజకీయ పార్టీలు కూడా చూడటం లేదు.. రాజకీయ పార్టీలు నేరమయ వ్యక్తుల విషయంలో ఎంతటి ఉదారత చూపుతున్నాయో కోటా వినూత వ్యవహారం ద్వారా మరోసారి బయటికి వచ్చింది.
స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తామని జనసేన పార్టీని సినీనటుడు పవన్ కళ్యాణ్ స్థాపించారు. సచ్చీలత కలిగిన నాయకులే తన పార్టీలో ఉంటారని పేర్కొన్నారు. కానీ వాస్తవంలో అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇంచార్జి కోటా వినూత వ్యవహారమే ఇందుకు బలమైన నిదర్శనంగా కనిపిస్తోంది.. ఆమె తన వద్ద పనిచేసిన శ్రీనివాసరాయుడు అనే డ్రైవర్ అంతం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆమెతోపాటు భర్త చంద్రబాబు కూడా జైలుకు వెళ్లారు. ప్రస్తుతం తమిళనాడు పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. రాజకీయపరంగా హై ప్రొఫైల్ కేసు కావడంతో దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Also Read: Jagan Bold Statement: జగన్ లో ఆ గంభీరం లేదు… కానీ రాజారెడ్డి కనిపిస్తున్నాడు
జనసేన ప్రస్తుతం కూటమిలో ఒక భాగం కాబట్టి.. పైగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాబట్టి.. సహజంగానే వైసిపి ఈ కేసు మీద విపరీతంగా ఫోకస్ పెట్టింది. వైసిపి అనుకూల సాక్షి మీడియా ఈ కేసు విషయంలో సంచలనమైన కథనాలను ప్రసారం చేస్తోంది. రాయుడి వ్యవహారంలో ఇప్పటికే జనసేన శ్రీకాళహస్తి మాజీ ఇన్చార్జి, చంద్రబాబు పాత్ర ఉందని తేల్చేసిన ఫ్యాన్ పార్టీ అనుకూల మీడియా.. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసింది. శ్రీనివాస రాయుడు నానమ్మ, అతడి సోదరి అభిప్రాయాలు తీసుకుంది. వారు చెప్పిన మాటల ప్రకారం.. ఈ కేసు గురించి పవన్ కళ్యాణ్ కు తెలుసని.. పవన్ కళ్యాణ్ కు దిగిన విషయం చెప్పి తన మనవడి ప్రాణాలు కాపాడాలని కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డానని శ్రీనివాసరాయుడు నానమ్మ ఆవేదన వ్యక్తం చేసినట్టు వైసిపి అనుకూల మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది. శ్రీనివాస రాయుడిని అవసరానికి వాడుకున్నారని.. అవసరం తీరిన తర్వాత అంతం చేశారని అతడి సోదరి వాపోతోంది. వినూత చెప్పినట్టుగా తన సోదరుడి ఖాతాలో డబ్బులు లేవని.. అతడికి ఎవరూ డబ్బులు ఇవ్వలేదని శ్రీనివాస రాయుడు సోదరి చెబుతోంది..
Also Read: Political Crime Case: ‘రసిక’ రాజకీయం..
వైసిపి అనుకూల మీడియా ప్రసారం చేసిన కథనాలలో శ్రీనివాస రాయుడు బంధువులు చెప్పినట్టుగా వాస్తవ పరిస్థితి మాత్రం ఉంటే ఈ కేసు మరింత జటిలంగా మారే ప్రమాదం ఉంది. అది కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కేసును చెన్నై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల సహకారం కూడా కోరుతున్నారు. ఈ కేసును చెన్నై పోలీసులు మాత్రమే పరిష్కరించాలని శ్రీనివాసరాయుడు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వినూత చెప్పినట్టు ఈ కేసులో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ప్రమేయం గనుక ఉండి ఉంటే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాకాకుండా శ్రీనివాసరాయుడు కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా వినూత, ఆమె భర్త ప్రమేయం మాత్రమే ఉంటే కూటమి ప్రభుత్వానికి ఎంతో కొంత రిలీఫ్ దక్కినట్టే.