TTD: మర్డర్ కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి అరెస్ట్

తొలుత అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన అలిపిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి సి సి ఫుటేజీలను పరిశీలించారు. అందులో ఇద్దరు వ్యక్తులు శివారెడ్డి పై దాడి చేసినట్లు గుర్తించారు.

Written By: Dharma, Updated On : May 30, 2024 2:03 pm

TTD

Follow us on

TTD: హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీ లక్ష్మీ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసేందుకు ప్రయత్నించినందుకు గాను అదుపులోకి తీసుకున్నారు. ఆమె భర్త గిరీష్ చంద్రారెడ్డి తో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. ఈనెల 25న తిరుపతి ఎన్జీవో కాలనీలో వెంకట శివారెడ్డి అనే వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. చావు బతుకులతో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. తీవ్ర గాయాలు కావడంతో తనపై ఎవరు దాడి చేశారు ఆయన చెప్పలేకపోయారు. కానీ విచారణలో మాత్రం పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. టిటిడి డిప్యూటీ ఈ శ్రీలక్ష్మి, ఆమె భర్త గిరీష్ చంద్రారెడ్డి ఈ ఘటనకు పాల్పడ్డారని తేలింది.

తొలుత అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన అలిపిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి సి సి ఫుటేజీలను పరిశీలించారు. అందులో ఇద్దరు వ్యక్తులు శివారెడ్డి పై దాడి చేసినట్లు గుర్తించారు. దీంతో శివారెడ్డితో ఎవరెవరికి వైరం ఉంది అని ఆరా తీయడం ప్రారంభించారు. అయితే ఎదురెదురు ఇళ్లల్లో ఉండే శ్రీలక్ష్మి, శివారెడ్డి కుటుంబాలకు పడదు. చాలా విషయాల్లో ఇరు కుటుంబాలకు వివాదాలు జరిగాయి. పెద్దలు కలుగజేసుకుని సద్దుమణిగించేవారు. అయితే ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మి దంపతులు ఇద్దరు వ్యక్తులకు సుఫారీ ఇచ్చారు. శివారెడ్డి పై దాడికి పురమాయించారు.

శివారెడ్డి పై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి పురమాయించింది శ్రీ లక్ష్మీ దంపతులేనని తేలడంతో వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. మరోవైపు శివారెడ్డి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేవలం చిన్నపాటి వివాదాలే ఈ ఘటనకు దారి తీసినట్లు తెలుస్తోంది. అలిపిరి పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.