Dharmana brothers: వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress)పార్టీలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం వైసీపీలో కొత్త సమీకరణ మొదలైంది. ధర్మాన బ్రదర్స్ యాక్టివ్ అవుతున్న వేళ జగన్ వైఖరి వారిని ఇబ్బందుల్లో పెట్టింది. దువ్వాడ శ్రీనివాస్ కు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వార్తతో ధర్మాన బ్రదర్స్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీలో ఉంటూనే తమ పట్ల దువ్వాడ శ్రీనివాస్ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారని.. అటువంటి వ్యక్తిని తిరిగి పార్టీలోకి రప్పించాలనుకోవడం ఏంటనే వాదన ధర్మాన బ్రదర్స్ తెస్తున్నట్లు సమాచారం. దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడిన తర్వాత కూడా ఆయన జగన్మోహన్ రెడ్డిని ఆరాధించి.. ధర్మాన బ్రదర్స్ ను టార్గెట్ చేసుకోవడం వెనుక వైసీపీ పెద్దలు ఉన్నారన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ధర్మాన బ్రదర్స్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నట్లు సమాచారం. ఒకవేళ దువ్వాడ శ్రీనివాస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇస్తే మాత్రం తమ పని తాము చూసుకోవాలని ధర్మాన బ్రదర్స్ భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా ధర్మాన కృష్ణ దాస్ అయితే తీవ్ర మనస్థాపనతో ఉన్నట్లు సమాచారం.
కృష్ణదాస్ మనస్థాపం..
కొద్ది రోజుల కిందట దువ్వాడ శ్రీనివాస్ ( duvvada Srinivas ) ధర్మాన కృష్ణ దాస్ ను టార్గెట్ చేసుకొని చేసిన కామెంట్స్ పొలిటికల్ వర్గాల్లో తెగ హడావిడి నడిచింది. తనపై ధర్మాన కృష్ణ దాస్ అనుచరులు దాడికి ప్రయత్నిస్తున్నారు అన్న విషయాన్ని స్వయంగా దువ్వాడ శ్రీనివాస్ బయటపెట్టారు. ఏకంగా జాతీయ రహదారిపై హల్చల్ చేశారు. కింజరాపు కుటుంబంతో కలిసి ధర్మాన కుటుంబం తనను రాజకీయంగా తీవ్ర నష్టం చేకూర్చిందని.. అందుకే వారిని కేడి బ్రదర్స్ గా వర్ణిస్తూ వ్యాఖ్యానాలు చేశారు. అర్ధరాత్రి జాతీయ రహదారిపై సవాల్ పర్వంతో విరుచుకుపడ్డారు. ధర్మాన కృష్ణ దాస్ ను నేరుగా హెచ్చరిస్తూ చాలా రకాల కామెంట్లు చేశారు. అటువంటి దువ్వాడ శ్రీనివాస్ ను ఇప్పుడు జగన్ చేరతీయడంపై ధర్మాన సోదరులు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.
ఇప్పుడిప్పుడే యాక్టివ్..
సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఇటీవల క్రియాశీలకం అయ్యారు. ఫలితాలు వచ్చిన ఏడాదిన్నర వరకు ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆది నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి నాయకత్వం విషయంలో అనుకున్న స్థాయిలో సంతృప్తిగా లేరు. ముందుగా ధర్మాన కృష్ణ దాస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. 2014 ఎన్నికలకు ముందు అనుకొని పరిస్థితుల్లో ధర్మాన ప్రసాదరావు వైసీపీలో చేరాల్సి వచ్చింది. 2019లో గెలిచిన ధర్మాన ప్రసాదరావుకు కాదని కృష్ణదాస్ మంత్రి పదవి ఇచ్చారు జగన్. అప్పట్లో కూడా పార్టీకి అంటి ముట్టనట్టుగా వ్యవహరించారు. తిరిగి మంత్రి పదవి ఇచ్చేసరికి యాక్టివయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఫుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. మధ్యలో పార్టీ మారుతారని కూడా ప్రచారం నడిచింది. కానీ కూటమి పార్టీల్లో అవకాశం లేకపోవడంతో వైసీపీలో ఇటీవల యాక్టివ్ అయ్యారు. ఇంతలోనే జగన్ మళ్లీ దువ్వాడను వెనుకేసుకొస్తారన్న అనుమానాలు పెరగడంతో ఆగ్రహంతో ధర్మాన ప్రసాదరావు రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.
దువ్వాడ వైపే మొగ్గు..
విధేయత విషయంలో ధర్మాన ప్రసాదరావు కంటే దువ్వాడ శ్రీనివాస్ ను ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నట్లు ప్రచారం నడుస్తోంది. మరోవైపు బలమైన సామాజిక వైసీపీ విషయంలో ఆగ్రహంగా ఉందని తెలియడంతోనే.. అదే సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాసుపై వైసీపీ సస్పెన్షన్ ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే ఇండిపెండెంట్ అభ్యర్థులను బరిలో దించుతానని దువ్వాడ శ్రీనివాస్ ప్రకటించారు. అది అంతిమంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తుంది. అయితే అదే కారణంతో దువ్వాడ శ్రీనివాసులు తీసుకుంటే మాత్రం ధర్మాన సోదరులు సీరియస్ నిర్ణయం దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. ధర్మాన సోదరులు పార్టీ నుంచి బయటకు వెళ్లి పోతే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవు.