AP Government Door To Door Campaign: ఏపీలో టీడీపీ కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. మరో మూడేళ్ల పాలన ఉంది. తొలి రెండేళ్లు కూటమి పాలనపై సంతృప్తి శాతం అధికంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మిగతా మూడేళ్లు మంచి పాలన అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తుండడంతో.. కూటమి ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి వివరించాలని సీఎం చంద్రబాబు కూటమి పార్టీల శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఇటీవల వర్చువల్ విధానంలో ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలతో ఆయన చర్చించారు. ప్రతి ఇంటికి వెళ్లాలని పార్టీ నేతలకు ఆయన తేల్చి చెప్పారు. ప్రతి ఇంట్లో ఎంతమందికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయో.. జాబితాను తీసుకొని మరీ వివరించాలన్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే వివాదాలు, వాగ్వాదాలకు అవకాశం ఇవ్వకుండా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని కూడా ఆదేశించారు.

* ప్రతి ఇంటికి 15 నిమిషాలు..
సెప్టెంబర్ నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం చూస్తోంది. అందుకే 45 రోజుల ప్రచార కార్యక్రమాన్ని రూపొందించింది. కూటమి నేతలు ప్రతి ఇంటికి 15 నిమిషాల చొప్పున సమయం కేటాయించాలని కూడా చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని పుస్తకాలు లేదా కరపత్రాలతో వివరించునున్నారు. ప్రతి కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించాలని.. ఎవరైనా ఇబ్బందులను ప్రస్తావిస్తే వాటిని పరిష్కరించేందుకు వీలుగా వినతి పత్రాలు తీసుకోవాలని కూడా సూచించడం విశేషం. కూటమి వచ్చిన తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ధిని ప్రజలకు వివరించాలనే ప్రయత్నంలో భాగమే ఈ కార్యక్రమం.
* సంక్షేమంతో పాటు అభివృద్ధి గురించి..
ఏపీలో కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోంది. పెద్ద ఎత్తున ప్రజలకు మౌలిక వసతులను కూడా కల్పిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో పురోగతి.. పెద్ద ఎత్తున పెట్టుబడుల సాధన, విశాఖలో ఐటీ పరిశ్రమల ఏర్పాటు, రాయలసీమలో తయారీ రంగ పరిశ్రమలు, మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు, మారిన రోడ్ల రూపురేఖలు.. ఇలా ప్రతి అంశాన్ని కూటమినేతలు ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు. ప్రభుత్వం ఏం చేసిందనే దానిపై ప్రజలకు వివరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.
* ప్రజలను నప్పించి ఒప్పించి..
ప్రజలను ఒప్పించడం ద్వారా.. వారికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమంతో పాటు అభివృద్ధిని చెప్పడం ద్వారా.. వారి అభిమానాన్ని చూరగొనాలని ప్రయత్నంలో ఉంది కూటమి ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. పార్టీ క్యాడర్ కు, నాయకత్వానికి ప్రజలతో మమేకం చేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టనుంది. ఇప్పటికే 45 రోజుల ప్రచార కార్యక్రమం ప్రారంభం అయింది. ఇది ముగిసిన మరుక్షణం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది ప్రభుత్వం. పట్టణ ప్రాంతాల్లో ఉన్న సానుకూలతను అంచనా వేసుకుని ఈ నిర్ణయానికి వచ్చింది. తరువాత ప్రాదేశిక ఎన్నికలకు.. చివరిగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయాలని చూస్తోంది. మరి కూటమి ప్రభుత్వం చేసే ఈ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.


