Thalliki Vandanam Scheme: ఏపీలో విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. పిల్లల చదువుకు గాను తల్లికి వందనం కింద 13 వేల రూపాయల చొప్పున సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 12న పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం తెరుచుకోనున్నాయి. ఆరోజు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత విద్యా సంవత్సరంలో కూడా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నగదు సాయం అందింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో సాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వేసవి సెలవుల అనంతరం జూన్ 12న పాఠశాలలు తెరుచుకొనున్నాయి. జూన్ 1న జూనియర్ కాలేజీలు తెరవనున్నారు. 12న తల్లికి వందనం నిధులు జమ చేయనున్నారు.
* ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి..
గత ఏడాది తల్లికి వందనం పథకాన్ని సమగ్రంగా అమలు చేశారు. అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నగదు సాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గత ఏడాది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తింపజేశారు. గరిష్టంగా ఐదుగురు పిల్లల వరకు లబ్ధి పొందిన వారు ఉన్నారు. అందుకే ఈ ఏడాది కూడా అలానే అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పథకానికి సంబంధించి అన్ని సన్నాహాలను పూర్తి చేసింది. ముందుగా జాబితాలను సచివాలయాల వారీగా పంపించనుంది. అటు తర్వాత విద్యాశాఖ దానిని సేకరించి నిధుల విడుదలకు నిర్ణయించింది.
* గత ఏడాది ఇబ్బందులు..
అయితే గత ఏడాది చాలామంది అర్హులు ఈ పథకానికి ఇబ్బంది పడ్డారు. ప్రధానంగా విద్యుత్తు 300 యూనిట్ల వినియోగం, బ్యాంకు ఖాతాతో ఆధార్ అనుసంధానం కాకపోవడం, మ్యాపింగ్ కాకపోవడం, బ్యాంకు ఖాతా యాక్టివ్ లేకపోవడం వంటి వాటితో చాలామంది పథకానికి దూరమయ్యారు. అటువంటి వారికి ఈ ఏడాది ముందుగానే అధికారులు హెచ్చరిస్తున్నారు. బ్యాంక్ ఖాతాతో ఆధార్ అనుసంధానం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎంపీసీఐ మ్యాపింగ్ కూడా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తప్పకుండా అవి చేస్తేనే తల్లికి వందనం దక్కుతుంది. ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ఇవన్నీ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది.
