Telangana vs Andhra Pradesh: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 12 ఏళ్లు గడిచింది. ఒకే రాష్ట్ర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా విడిపోయాయి. విభజన తర్వాత తెలంగాణలో కరెంటు ఉండదని, నక్సలిజం పెరుగుతుందని అప్పట్లో కొందరు నేతలు వ్యాఖ్యానించారు. మరో బిహార్ అవుతుందని హెచ్చరించారు. అయితే ఇందుకు విరుద్ధంగా రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి వేగం పుంజుకుంది. వేర్వేరు ప్రాధాన్యతలతో అభివృద్ధి పనులు చేపట్టాయి. ఒక్కొక్క రాష్ట్రం తన ప్రధాన సమస్యలను దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాలను నిర్మించుకుంది. ఇది రెండు రాష్ట్రాల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని సృష్టించింది.
హైదరాబాద్లో ఫ్లై ఓవర్లు…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినత ర్వాత అధికారం చేపట్టిన కేసీఆర్ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంపై ఎక్కువ దృష్టి పెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు ఒక దశాబ్దంలో హైదరాబాద్లోనే 35కిపైగా ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు, సబ్వేలు నిర్మించడం ద్వారా ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరచింది. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, రోడ్ల విస్తరణ, చెరువుల సుందరీకరణ వంటి పనులు కూడా చేపట్టింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ క్రమాన్ని కొనసాగిస్తూ మరిన్ని ఫ్లై ఓవర్లను ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్లో విమానాశ్రయాలు..
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర విభజన తర్వాత విమానాశ్రయాల అభివృద్ధిపై ఎక్కువ దృష్టి సారించింది. కర్నూల్, కడప, భోగాపురం వద్ద కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేయడం, అమరావతిలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం, గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలకు సన్నాహాలు చేయడం ద్వారా రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరచాలని ప్రయత్నిస్తోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు త్వరలో అందుబాటులోకి రానుంది.
ఏపీలో నగరాభివృద్ధి లోపం..
ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఫ్లై ఓవర్ల నిర్మాణం చాలా తక్కువగా ఉంది. మెట్రో ప్రాజెక్టులతో ఫ్లై ఓవర్లను ముడిపెట్టే ప్రతిపాదనలు కేంద్రం నుంచి ఆమోదం పొందలేకపోవడం ఒక కారణం. రాజధాని అమరావతి నిర్మాణంపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల మిగిలిన జిల్లాలు, నగరాల్లో ఫ్లై ఓవర్లు, రోడ్ల విస్తరణ పనులు వెనకబడ్డాయి. అలాగే నగరాల్లో పచ్చదనం పెంచడంలో కూడా తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంది.
రెండు రాష్ట్రాల ప్రాధాన్యతలు…
తెలంగాణ ప్రభుత్వం పట్టణీకరణ వల్ల ఏర్పడిన ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి ఫ్లై ఓవర్లు, రోడ్ల అభివృద్ధిని ప్రాధాన్యతగా తీసుకుంది. అయితే కొత్త విమానాశ్రయాల ఏర్పాటులో వెనుకబడింది. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు ఆమోదం వచ్చినా నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. ఆంధ్రప్రదేశ్ మాత్రం రాష్ట్ర విభజన తర్వాత కనెక్టివిటీ, ఆర్థిక వృద్ధిని దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయాలు, హైవేల నిర్మాణంపై ఎక్కువ దృష్టి పెట్టింది. కానీ నగరాల్లో ట్రాఫిక్ సౌకర్యాలు, ఫ్లై ఓవర్ల నిర్మాణంలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది.
ప్రస్తుతం తెలంగాణకు కొత్త విమానాశ్రయాలు అవసరం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్కు నగరాల్లో ఫ్లై ఓవర్లు, రోడ్ల విస్తరణ, పచ్చదనం పెంచడం అత్యవసరం. రెండు రాష్ట్రాలు తమ బలహీనతలను గుర్తించి, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటూ సమతుల్య అభివృద్ధిని సాధించాల్సిన అవసరం ఉంది.
