Chintakayala Vijay: రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మహానాడు కొనసాగుతోంది. తొలిసారిగా హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఇంధన ఆదాలో భాగంగా ప్రధాని సూచనతో పూర్తి డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న ఈ మహానాడుకు ఎంతో ఆదరణ లభిస్తోంది. ఏకకాలంలో లక్షలాదిమంది టిడిపి కార్యకర్తలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నారు. దాదాపు ఓ 20 తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చిస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో తీర్మానాలను పెట్టాలని కూడా సూచించింది నాయకత్వం. అయితే ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ టిడిపి నుంచి వింత ప్రతిపాదన, తీర్మానం వచ్చింది. అది స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అక్కడి టిడిపి శ్రేణులు అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ కు పదవి ఇవ్వాలని తీర్మానించడం విశేషం.
* సుదీర్ఘ నేపథ్యం..
తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘ అనుబంధం చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబానికి. 1983 నుంచి ఇప్పటివరకు అంటే ఓ రెండు సార్లు తప్పించి.. ఏకధాటిగా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు అయ్యన్నపాత్రుడు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయన మంత్రి అయ్యారు. ఈసారి మాత్రం శాసనసభ స్పీకర్ గా ఎంపికయ్యారు. 1998లో అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు అయ్యన్నపాత్రుడు. తెలుగుదేశం పార్టీ పట్ల విధేయత చూపించడంలో ముందుంటుంది అయ్యన్నపాత్రుడు కుటుంబం. ఆయన రాజకీయ వారసుడిగా విజయ్ తెరపైకి వచ్చారు. తండ్రి మాదిరిగా దూకుడుగా ఉంటారు. వైసిపి ఐదేళ్ల కాలంలో అస్సలు వెన్నుచూపలేదు. పైగా టిడిపి సోషల్ మీడియాకు విశేష సేవలు అందించారు. ప్రస్తుతం నర్సీపట్నం నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది.
* విజయ్ కు పదవి ఇవ్వాలని..
అయితే తాజా మహానాడులో విజయ్ కు రాజ్యసభ పదవి ఇవ్వాలని తీర్మానించింది టిడిపి. ఎందుకంటే ఆయన పార్టీ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ఇవ్వాలని నర్సీపట్నం టిడిపి క్యాడర్ కోరుకుంటుంది. గత కొద్ది రోజులుగా రాజ్యసభకు విజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీసీ సామాజిక వర్గం ఆపై యువకుడు కావడంతో కలిసి వచ్చే అంశం. వైసిపి హయాంలో సైతం ధైర్యంతో ముందుకు సాగిన చరిత్ర ఆయనది. లోకేష్ టీంలో కీలక సభ్యుడు కూడా. అందుకే ఆయనకు రాజ్యసభ పదవి ఇవ్వాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీలోనే పెరుగుతుంది. చూడాలి మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో…
