TDP Women Reservation: తెలుగుదేశం పార్టీ మహానాడు కొనసాగుతోంది. పూర్తి హైబ్రిడ్ విధానంలో ఏర్పాటుచేసిన మహానాడు తొలిరోజు సక్సెస్ అయ్యింది. రెండో రోజు కూడా కొనసాగుతోంది. గత మహానాడులకు భిన్నంగా ఈసారి జరుగుతుండడం విశేషం. పూర్తి డిజిటల్ విధానంలో దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది టీడీపీ శ్రేణులు ఈ మహానాడులో భాగస్వామ్యం కావడం ఈసారి ప్రత్యేకత. మరోవైపు తొలిరోజు భారీ సంచలనం నమోదయింది. 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం టికెట్లు ఇస్తామని స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రకటన చేశారు. పార్లమెంట్లో ప్రవేశ పెట్టే బిల్లుతో సంబంధం లేకుండానే ఏపీలో అమలు చేసి తీరుతామని ప్రకటన చేశారు లోకేష్. ఇది మహిళలోకాన్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. టిడిపి నుంచి వచ్చిన ఈ ప్రకటనతో మిగతా రాజకీయ పక్షాలు బెంబేలెత్తిపోతున్నాయి. పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డాయి.
* మహిళకు రాజ్యసభ పదవి
అయితే వచ్చే ఎన్నికల వరకు కాదు. తాజా రాజ్యసభ ఎన్నికల్లో సైతం ఈ మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలని చంద్రబాబు సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి బిజెపికి ఛాన్స్ లేదని.. మూడు పదవులను టిడిపి తీసుకుని.. ఒక పదవి జనసేనకు కేటాయించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ బిజెపి పెద్దలు అడిగితే కచ్చితంగా చంద్రబాబు మెత్తబడతారు. మరోవైపు టిడిపి సభ్యుడిగా ఉన్న సానా సతీష్ మరోసారి ప్రమోట్ కావడం ఖాయం. అదే జరిగితే మిగిలేది ఒకే ఒక రాజ్యసభ టిడిపికి. ఆ పదవి సైతం మహిళలకు కేటాయించి మంచి సంకేతాలు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు.
* మహిళల్లో ఆసక్తి..
అయితే ఈసారి మహానాడు చాలా భిన్నంగా ఉంది. పూర్తిగా మహిళా ధీమ్ తో కొనసాగుతున్న ఈ మహానాడులో మహిళా నేతలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈసారి మహిళలకు రాజకీయ అవకాశాలు పెరుగుతాయని భావించి.. సీనియర్లు సైతం తమ వారసులను ప్రోత్సాహం అందిస్తున్నారు. అయితే మహిళలకు 33 శాతం టికెట్లు కేటాయింపు ప్రకటన పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనిని కొనసాగింపు చెయ్యాలని భావిస్తున్న చంద్రబాబు మహిళలకు రాజ్యసభ పదవి ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
