YSRCP Meeting: తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ మహానాడు కొనసాగుతోంది. తొలి రోజు సక్సెస్ అయ్యింది. రెండో రోజు ఈ రోజు కొనసాగనుంది. అయితే టిడిపి మహానాడు ను దెబ్బతీయాలని చూసారు జగన్మోహన్ రెడ్డి. మీడియా వాచ్ మొత్తం మహానాడు పై ఉంటుందని గ్రహించి.. అదేరోజు రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. తద్వారా మీడియా దృష్టి కొంతవరకు మరల్చవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. కానీ అది అంత సులువు కాదని తేలిపోయింది. ఎందుకంటే కేవలం అనుకూల మీడియా తప్ప.. మిగతా మీడియా దృష్టి అంతా మహానాడు పైనే ఉంచింది. గతానికి భిన్నంగా మహానాడు నిర్వహించడం… దానిని హైబ్రిడ్ అనే పేరు పెట్టడం ద్వారా.. అందరి దృష్టి అటువైపు వెళ్లేలా చేశారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకుని టిడిపి మహానాడు నిర్వహించిన రోజే పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం వెనుక పక్కా ప్లాన్ ఉందన్నది ఇట్టే తెలిసిపోతోంది. కానీ దానిని చిత్తు చేశారు చంద్రబాబు.
* మహానాడుపై అంచనాలు..
సాధారణంగా మహానాడు అంటేనే మిగతా రాజకీయ పక్షాలకు ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. నందమూరి తారక రామారావు ఈ క్షణం మహానాడు ప్రారంభించారో తెలియదు కానీ.. పార్టీ అభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా అక్కడ చర్చలు జరగడం.. సామాన్య కార్యకర్త నుంచి అధినేత వరకు అక్కడ కలుసుకోవడం.. యువతతో పాటు మహిళలకు ప్రత్యేక స్థానం ఇచ్చి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పైగా అక్కడ ఆతిథ్యం, భోజన ఏర్పాట్లు అన్ని ప్రత్యేకమే. కానీ వాటిని పక్కన పెట్టి నిన్న హైబ్రిడ్ విధానంలో మహానాడు ఏర్పాటు చేశారు. దీంతో అందరి అంచనాలు హైబ్రిడ్ మహానాడు పై ఉండేవి. జాతీయ మీడియా సైతం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
* సైలెంట్ గా ఉండలేక..
ఏదైనా ఒక పార్టీ భారీ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ప్రత్యర్థి పార్టీ వాటి జోలికి పోదు. చాలా సైలెంట్ గా ఉండి గమనిస్తుంది. అయితే హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు పై భారీ హైప్ ఏర్పడింది. ఎలా నిర్వహిస్తారు అనే సందిగ్ధం అన్ని పార్టీల్లో ఉండేది. జాతీయ స్థాయిలో సైతం ఇది చర్చకు దారి తీసింది. కచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీకి జాతీయ స్థాయిలో సైతం మంచి పేరు తీసుకొస్తుందని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సైతం ఆకర్షిస్తుందని గ్రహించి జగన్మోహన్ రెడ్డి వైసీపీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఒకటి మీడియా ఒకే స్టాండ్ లో ఉండకుండా చూసుకోవడం.. ఇంకొకటి సొంత పార్టీ నేతల్లో అభద్రతాభావం రాకుండా చూసుకోవాలన్న ఉద్దేశంతోనే.. హైబ్రిడ్ మహానాడుకు ధీటుగా వైసిపి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు అనేది పొలిటికల్ వర్గాల్లో వస్తున్న ఒక మాట. అందులో ఎంత నిజం ఉందో చూడాలి.
