Sajjala Ramakrishna Reddy: ఏదైనా తప్పు జరిగితే ఒప్పుకోవాలి. ఆ తప్పునకు పర్యవసానాలు గురించి ప్రస్తావించాలి. తప్పునకు దారి తీసిన పరిస్థితులను వివరించాలి. కానీ ఆ ప్రయత్నం చేయకపోగా వితండవాదం చేస్తే.. అది ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నదని ఇట్టే చెప్పొచ్చు. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో కూడా వైసిపి వాదన అలానే ఉంది. సకల శాఖ మంత్రి సజ్జల వారు ఆలస్యంగా స్పందించారు. చిన్నపిల్లాడి చాక్లెట్ మాదిరిగా వివరించే ప్రయత్నం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మిగతా అల్లర్ల మాట ఏమిటని ప్రశ్నించారు. పోలింగ్ జరిగి పది రోజుల తరువాత ఆ అల్లర్ల మాటేమిటిని ప్రశ్నించడంతో.. తన బేలతనాన్ని చూపించుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అల్లర్లపై సిట్ దర్యాప్తు కొనసాగింది. అందులో భాగంగా మాచర్ల నియోజకవర్గంలో 200 పోలింగ్ కేంద్రాల్లో సీసీ పూటేజీలను పరిశీలించారు. అందులో ఒక కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఈవీఎంలను ధ్వంసం చేయడం కనిపించింది. అక్కడున్న వారితో గొడవకు దిగడం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై స్పందించే క్రమంలో సజ్జల మాట్లాడిన తీరు మాత్రం బాగాలేదు. మరి మిగతా ప్రాంతాల్లో టిడిపి నేతలు ధ్వంసం చేసిన ఈవీఎంల మాటేమిటని ప్రశ్నించారు సజ్జల. అంటే పోలింగ్ తరువాత, పిన్నెల్లి ఎపిసోడ్ బయటపడిన తర్వాత.. సజ్జల వారు ఈ ప్రశ్నలు సంధించడం విశేషం. ఇందులో ముమ్మాటికీ ఆయన మార్క్ కామెంట్స్ స్పష్టంగా కనిపించాయి.
ఆయన ఆరోపించిన మాదిరిగా టిడిపి నేతలు ఈవీఎంలను ధ్వంసం చేశారని అనుకుందాం. అదే జరిగితే ఒక్క వైసీపీ నేత అయినా ప్రశ్నించేవారు కదా? రాష్ట్రవ్యాప్తంగా 151కి పైగా స్థానాలను గెలుచుకుంటామన్న జగన్ ప్రస్తావించేవారు కదా? దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేవారు కదా? అటు సాఫీగా ఎన్నికలు జరిగాయని జగన్ విదేశాలకు వెళ్లారు. ఏపీలో అలజడులు రేగాయని కేంద్ర బలగాలు వచ్చాయి. సీట్ దర్యాప్తు కొనసాగుతోంది. అందులో భాగంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం బయటపడింది. అప్పటివరకు తెలుగుదేశం సైతం విధ్వంసాలకు పాల్పడిందని వైసీపీ నేతలకు తెలియక పోవడం, ప్రస్తావించకపోవడం గమనార్హం. కానీ ఎలక్షన్ కమిషన్ సీరియస్ యాక్షన్ కు దిగేసరికి.. ఇప్పుడు సజ్జల వారు సెలవివ్వడం మాత్రం హాస్యాస్పదంగా ఉందని సర్వత్రా వినిపిస్తున్న మాట.