Site icon OkTelugu

Rushikonda: అసెంబ్లీలో ‘రుషికొండ’.. కూటమి ప్లాన్ అదే!

Rushikonda

Rushikonda

Rushikonda: రుషికొండ( rushikonda ) విషయంలో మళ్ళీ కదలిక ప్రారంభం అయింది. ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రుషికొండ భవనాలను పరిశీలించారు. ప్రభుత్వానికి విలువైన సూచనలు ఇచ్చారు. జనసేన తరఫున ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పారు. ఇంకోవైపు ఏపీ ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో రుషికొండ భవనాలపై క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేయనుంది. అయితే మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే మాత్రం వచ్చే వర్షాకాలం అసెంబ్లీ సమావేశాల్లో రుషికొండ పైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ సైతం నిన్ననే వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ జరిగిన అవినీతి, ప్రభుత్వ అధికార దుర్వినియోగం ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో వైసీపీని ప్రజల్లో దోషిగా నిలబెట్టేందుకు కూటమి ప్రయత్నిస్తోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Also Read: బీసీసీఐ అధ్యక్షుడు ఎందుకు రాజీనామా చేశాడు? అసలేం జరిగింది?

* అప్పటి గోప్యానికి ఇప్పుడు మూల్యం..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) హయాంలో 470 కోట్ల రూపాయలతో రుషికొండలో భవనాలను నిర్మించారు. కానీ అక్కడ ఏం నిర్మాణాలు చేస్తున్నాం అనేది అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా చెప్పలేకపోయారు. దానికి కారణం పర్యావరణ అనుమతులు, న్యాయపరంగా చిక్కులు. అయితే అప్పట్లో మౌనం ఇప్పుడు శాపంగా మారింది. కనీసం దాని గురించి మాట్లాడే ధైర్యం వైసిపి నాయకులు చేయడం లేదు. వాస్తవానికి రుషికొండ అనేది విశాఖలో ఒక ల్యాండ్ మార్క్. ప్రముఖ పర్యాటక ప్రాంతం. విపరీతంగా పర్యాటకులు వచ్చేవారు. ఏడాదికి ప్రభుత్వానికి ఒక్క రుషికొండ ద్వారానే ఏడు కోట్ల రూపాయల ఆదాయం సమకూరేది. అటువంటి రుషికొండలో నిర్మాణాలను తొలగించి కొత్త భవనాలు ఎందుకు నిర్మిస్తున్నాం అన్నది చెప్పలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండడం ఆ పార్టీకి ఇప్పుడు మైనస్ చేస్తోంది.

* చెప్పలేకపోయిన జగన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంది. కానీ దానిని పట్టాలెక్కించలేకపోయింది. అయితే 2024 ఎన్నికల్లో రెండోసారి గెలిస్తే కచ్చితంగా విశాఖ( Visakhapatnam) నుంచి పాలన సాగించాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. అందుకే రుషికొండలో భారీ భవనాలను నిర్మించారు. అయితే కోర్టు ఆదేశాలు, పర్యావరణ అనుమతులు వంటివి పరిగణలోకి తీసుకొని అసలు ఆ భవనాలు ఎందుకు నిర్మించామో.. చెప్పే సాహసం చేయలేదు. అప్పట్లో ఒకరిద్దరు మంత్రులతో మాట్లాడించారు. నేరుగా అవి ప్రభుత్వ భవనాలే అని చెప్పలేకపోయారు. అది ప్రజల ఆస్తి అని.. ముఖ్యమంత్రి కార్యాలయం కోసమే నిర్మించామని.. ప్రభుత్వ యంత్రాంగం ఉంటుందని కనీసం చెప్పలేదు. దాని పర్యవసానాలు ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారాయి. కూటమి ప్రభుత్వానికి వరంగా మారాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రుషికొండ భవనాల విషయంలో కూటమి మరింతగా పట్టు బిగించే పరిస్థితి కనిపిస్తోంది.

* ప్రారంభించకుండానే శిథిలం..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( deputy CM Pawan Kalyan)నిన్ననే రుషికొండ భవనాలను పరిశీలించారు. ఆ భవనం ప్రారంభించకుండానే పెచ్చులూడి పడుతుండడాన్ని గుర్తించారు. దానిపైనే మాట్లాడారు. దీంతో ఇప్పటివరకు అధికార దుర్వినియోగం చేశారన్నది ఒక ఆరోపణ. కానీ ఇప్పుడు భవన నిర్మాణ పనుల్లో సైతం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని.. కనీసం నాణ్యత పాటించడం లేదన్న విమర్శ బయటకు వచ్చింది. అదే సమయంలో పవన్ సైతం అప్పటి వైసిపి ప్రభుత్వ అధికార దుర్వినియోగం, ప్రభుత్వ ఆదాయం పక్కదారి వంటి ఆరోపణలు చేయగలిగారు. ఆ భవనాల వినియోగంపై కూటమి ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలు చేశారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం రుషికొండ భవనాల విషయంలో వ్యవహరించిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పవన్ డిసైడ్ అయ్యారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైనే ఎక్కువగా చర్చించే అవకాశం ఉంది. అయితే ఇది తప్పకుండా ప్రభావితం చేస్తుందన్న ఆందోళన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version