Roja: రోజా ఇలా మాట్లాడుతుందని.. ఒక మాటలోనే గాలి తీసేస్తుందని వైసీపీ నేతలు కలలో కూడా ఊహించి ఉండరు. రోజా ఆ మాట అనడం.. ఆ వీడియోలో క్షణాల్లోనే వ్యాప్తి కావడం.. ఇవన్నీ కూడా వెంటవెంటనే జరిగిపోయాయి. ఇప్పుడు ఏం మాట్లాడాలో.. ఎలా కౌంటర్ ఇవ్వాలో తెలియక వైసీపీ నేతలు తలలు పట్టుకున్నారు. ఆ మాట మాట్లాడిన రోజా కనిపించడం లేదు. ఆమె ఇప్పుడు టీవీ షోలలో బిజీగా ఉన్నారు.
అమరావతి రాజధానికి మొదటి నుంచి కూడా వైసిపి వ్యతిరేకం. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతి ఏర్పాటును స్వాగతించినప్పటికీ.. ఆ తర్వాత నాలుక మడత పెట్టాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పక్కన పెట్టాడు. మూడు రాజధానులు అంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. ఆ తర్వాత 2024 ప్రారంభంలో వైజాగ్ నగరాన్ని క్యాపిటల్ సిటీ అన్నాడు. ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి.. కొత్తగా మావిగన్ పాట అందుకున్నాడు.
మావిగన్ పేరును జగన్ ప్రతిపాదించిన తర్వాత వైసిపి నేతలు ఆ పేరును తెగ సర్కులేట్ చేయడం మొదలుపెట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ దీనిని ఆమోదయోగ్యమైన ప్రాంతంగా ప్రజలకు చెప్పడంలో వైసీపీ నేతలు విఫలమయ్యారు. చివరికి వైసీపీలో కీలకంగా ఉన్నవారు సైతం మావిగన్ విషయంలో ఒక క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు. అలా మాట్లాడి అభాసు పాలవుతున్నారు. ఈ జాబితాలో రోజా ప్రథమ స్థానంలో ఉంటారు.
ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా మావిగన్ విషయంలో క్లారిటీ లేకుండా మాట్లాడటంతో సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో..”మీకు హైదరాబాదులో ఇల్లు ఉంది.. చెన్నైలో ఇల్లు ఉంది. నగరిలో ఇల్లు ఉంది. ఇప్పుడు మీరు మావిగన్ లో కూడా ఇల్లు కట్టుకుంటారా” అని వ్యాఖ్యాత ప్రశ్నించారు..”నేను అంత రిచ్ కాదు.. కిరాయికి తీసుకుంటా..” అని రోజా రిప్లై ఇచ్చారు. “ఒకవేళ మీరు ఇల్లు కట్టాలి అనుకుంటే అమరావతిలో కట్టుకుంటారా.. మావిగన్ ప్రాంతంలో కట్టుకుంటారా” అని ఆ వ్యాఖ్యత ప్రశ్నించారు. “అమరావతి, మావిగన్ రెండు ఒకటే కదా” అని రోజా రిప్లై ఇవ్వడంతో జనసేన, టిడిపి, బిజెపి నాయకులకు కావలసినంత మసాలా దొరికింది. ఇంకేముంది రోజా దెబ్బకు సైలెంట్ అయిపోయింది. మావిగన్, అమరావతి రెండూ ఒకటే అయినప్పుడు.. జగన్ పదేపదే మావిగన్ పాట పాడటం ఎందుకు.. అమరావతి మీద విషాన్ని చిమ్మడం ఎందుకు అని.. టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.
