AP Politics: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుస్తానని జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ అది అంత ఈజీ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తోంది. ఐదు అంశాలను ప్రధానంగా ప్రాతిపదికగా తీసుకుంది. అవే తిరిగి కూటమిని నిలబెడతాయని బలంగా నమ్ముతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లోలోపల భయం ఉన్నా.. బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఐదు అంశాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కచ్చితంగా కూటమి వైపే స్పష్టమైన ముగ్గు కనిపిస్తోంది ప్రస్తుతానికి.
* లక్షల ఓట్ల తొలగింపు..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సర్ జరుగుతోంది. ఓటర్ల సమగ్ర సర్వే చేపడుతున్నారు. దొంగ ఓట్లకు చెక్ పెడుతున్నారు. ఈ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఆందోళన ఉంది. ఆ పార్టీపై ఒక విమర్శ కూడా ఉంది. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారిని సైతం ఓటర్లుగా చేర్పించారు అనేది ఆ పార్టీ ఆరోపణ. ప్రతి బూత్ పరిధిలో 50 ఓట్లకు తక్కువ కాకుండా ఇలాంటివి వైసిపి సానుభూతిపరులు కొనసాగుతున్నారు అనేది ఒక అంచనా. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 40 లక్షల ఓట్లు జాబితాల నుంచి తొలగించనున్నారు. అదే జరిగితే చాలా నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారు అవుతాయి.
* అత్యవసర సమయాల్లో పవన్..
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుల, మత విద్వేషాలను రెచ్చగొడుతోంది అనేది కూటమి నుంచి వచ్చే ఆరోపణ. కానీ అటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ కూటమికి అండగా నిలుస్తున్నారు. విధ్వంస రాజకీయాల్లో కులమతాలు పడకుండా, యువత కూటమి విషయంలో పక్క ఆలోచన చేయకుండా పవన్ గట్టిగా నిలబడుతున్నారు. మరో 15 సంవత్సరాలు పాటు కూటమి కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను ఎండగడుతున్నారు. ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెబుతున్నారు.
* అభివృద్ధి అజెండా..
అభివృద్ధి అజెండా అనేది కూటమి ప్రభుత్వంపై సానుకూలతకు ప్రధాన కారణం. గతంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్నట్టు పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చురుగ్గా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. రాయలసీమలో తయారీ రంగ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. ఇవన్నీ ప్రజల్లో ఒక రకమైన సంతృప్తికి కారణం.
* కూటమి సమన్వయం..
అన్నింటికీ మించి కూటమి మధ్య సమన్వయం. ఇచ్చిపుచ్చుకునే ధోరణి. మూడు పార్టీల నాయకత్వాలు సమన్వయంతో అడుగులు వేస్తున్నాయి. ఎక్కడ సమన్వయ లోపం లేకుండా వ్యవహరిస్తున్నాయి. ఆపై మరో 15 సంవత్సరాలు కూటమి కొనసాగాలని భావిస్తున్నాయి. పార్టీల నాయకత్వాల మధ్య విభేదాలకు అవకాశం లేదు. నియోజకవర్గాల స్థాయిలో సైతం సమన్వయం కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య విభేదాలు ఉన్నా.. ఎక్కడికక్కడే సద్దుమణిగించే వ్యవస్థ వచ్చింది. ఇది సైతం కలిసి వచ్చే అంశం.
* చివరి ఏడాది సంక్షేమం..
సంక్షేమ పథకాలు సైతం అమలు చేసి చూపిస్తున్నారు. ప్రధానమైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేసి లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నారు. సంప్రదాయ సంక్షేమ పథకాలకు ఎక్కడ బ్రేక్ ఇవ్వడం లేదు. మరోవైపు ఎన్నికల చివరి ఏడాది విచ్చలవిడిగా సంక్షేమ పథకాలు అమలు చేయనున్నారు. అవే ప్రచార అస్త్రంగా మార్చనున్నారు. తాము వస్తేనే అభివృద్ధితో పాటు సంక్షేమం కొనసాగుతుందని ప్రచారం చేయడం ద్వారా ప్రజల అభిమానాన్ని పొందనున్నారు. ఇలా ఈ ఐదు అంశాలు కూటమికి అనుకూలంగా మారనున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భయం కూడా అదే.
