Narendra Modi And Rahul Gandhi: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… ఈ పరిణామాలను చూసి విపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. “మోదీ పని అయిపోయింది”, “ఇక గద్దె దిగడమే తరువాయి” అంటూ ప్రచారం సాగుతోంది. కానీ రాజకీయాల్లో అనుభవం ఉన్నవారికి ఇది కేవలం ఒక చిన్న పరిణామమే. మూడు పర్యాయాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నరేంద్ర మోదీ రాజకీయ వ్యూహాన్ని అర్థం చేసుకోవడంలో విపక్షాలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ మరోసారి విఫలమైనట్లు కనిపిస్తోంది.
రాజీనామా… ఓటమి కాదు..
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే కాంగ్రెస్ నేతలు దీన్ని తమ విజయంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ జంతర్మంతర్ వద్దకు వెళ్లి, ప్రధాని నివాసం దగ్గర ధర్నా చేసి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవంగా, కాక్రోచ్ జనతా పార్టీ 20 రోజులకు పైగా నిరసనలు సాగించినప్పుడు రాహుల్ గాంధీ అటు వైపు కన్నెత్తి చూడలేదు. సీజేపీ నాయకత్వం కూడా కాంగ్రెస్ను పిలవలేదు. లాఠీచార్జ్ తర్వాత మాత్రమే రంగంలోకి దిగిన రాహుల్ గాంధీ, తర్వాత ప్రధాని మోదీ ఇంటి ఎదుట ధర్నా చేసి హడావుడి చేశారు. తరువాతి పరిణామాలతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆ తర్వాత కూడా సీజేపీ రాహుల్ను పట్టించుకోలేదు. మంత్రిని రాజీనామా చేయించడం ద్వారా విద్యార్థుల ఆగ్రహాన్ని తగ్గించి, సమస్యను నియంత్రణలోకి తీసుకువచ్చింది. పదవులు శాశ్వతం కావు అన్న సత్యాన్ని మోదీ బాగా అర్థం చేసుకున్నాడు. ఇది వెనుకడుగు కాదు, సమయానుకూల సర్దుబాటు. విపక్షాలు దీన్ని మోదీ ఓటమిగా చూపించాలని ప్రయత్నిస్తున్నా, రాజకీయ అనుభవం లేని వారికి మాత్రమే ఇది అర్థం కావడం లేదు.
కాంగ్రెస్ స్వయంకృతాపరాధం..
కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం దాని సొంత తప్పిదాలే. గతంలో బీజేపీని ఎదుర్కోవాలని సమాజ్ వాదీ పార్టీని ప్రోత్సహించి ఉత్తరప్రదేశ్లో 25 ఏళ్లుగా అధికారానికి దూరమైంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చి, కేజ్రీవాల్ను సీఎం చేసి, ఫలితంగా ఢిల్లీలో కాంగ్రెస్ కనుమరుగు అయింది.. 20 ఏళ్లుగా అక్కడ అధికారం దక్కలేదు. ఇలా అనేక ప్రాంతీయ పార్టీలను పెంచి పోషించడం వల్ల కాంగ్రెస్ అనేక రాష్ట్రాల్లో బలహీనపడింది.
రెండుసార్లు ప్రతిపక్ష హోదా దక్కలే..
2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా సాధించినా సొంతంగా 100 సీట్లు కూడా గెలవలేకపోయింది. వందేళ్ల చరిత్రలో 2014, 2018 పార్లమెంట్ ఎన్నికల్లో రెండుసార్లు కనీసం ప్రతిపక్ష స్థానం కూడా కోల్పోయిన పార్టీ ఇది. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేద్దామనుకున్న కాంగ్రెస్, రోజురోజుకు బలహీనపడుతూ ప్రాంతీయ పార్టీలకు మార్గం సుగమం చేస్తోంది.
సీజేపీ.. కొత్త ప్రత్యామ్నాయం?
ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)నిరసనలకు కాంగ్రెస్ చప్పట్లు కొడుతోంది. కానీ సీజేపీ రాహుల్ గాంధీని పట్టించుకోకపోవడం విశ్లేషకులకు ఆసక్తికరంగా కనిపిస్తోంది. యువత ఆధారిత ఈ ఉద్యమం కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని అంటున్నారు. బిజెపి వ్యతిరేక ఓటును సమీకరించాలనుకున్న కాంగ్రెస్, మరోసారి తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఎదుర్కొంటోంది.
మోదీ రాజకీయాలు సాధారణం కాదు. ఒక సవాలును అవకాశంగా మార్చుకునే నైపుణ్యం ఆయనకు ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ద్వారా ప్రభుత్వం బాధ్యత తీసుకున్నట్లు చూపించి, విద్యా వ్యవస్థలో సంస్కరణల దిశగా అడుగులు వేయవచ్చు. విపక్షాలు దీన్ని మోదీ పతనంగా చూస్తే, మోదీ మాత్రం దీనిని తన పటిష్టతను నిరూపించే అవకాశంగా మార్చుకొనే అవకాశం ఉంది. మోదీ గేమ్ను అర్థం చేసుకోవడంలో విఫలమైనంత కాలం, విపక్షాలు ఇలాంటి విజయాలతోనే సంతృప్తి చెందుతూ ఉండాలి.


