AP Elections 2024: పిఠాపురం, కాకినాడలో అల్లర్లకు ప్లాన్.. గట్టి హెచ్చరికలు

పోలింగ్ నాడే ఏపీలో హింసాత్మక ఘటనలు జరిగాయి.గతంలో ఎన్నడూ చూడని దృశ్యాలు వెలుగు చూశాయి.తలలు పగిలాయి. రక్తసిక్తం అయ్యాయి. ప్రధానంగా పల్నాడు, మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రిలో హింస చోటుచేసుకుంది.

Written By: Dharma, Updated On : May 20, 2024 5:32 pm

AP Elections 2024

Follow us on

AP Elections 2024: ఏపీ విషయంలో మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది కేంద్ర నిఘా సంస్థ. కౌంటింగ్ నాడు అల్లర్లు జరగడం ఖాయమని తేల్చింది. ముఖ్యంగా పిఠాపురం, కాకినాడ సిటీలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని గుర్తించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. అప్రమత్తంగా వ్యవహరించాలని ఏపీ పోలీస్ శాఖకు ఆదేశించింది. దీంతో పోలీస్ శాఖ అలర్ట్ అయింది. కాకినాడ సిటీ తో పాటు పిఠాపురం నియోజకవర్గాన్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర బలగాలు సైతం మొహరించాయి.

పోలింగ్ నాడే ఏపీలో హింసాత్మక ఘటనలు జరిగాయి.గతంలో ఎన్నడూ చూడని దృశ్యాలు వెలుగు చూశాయి.తలలు పగిలాయి. రక్తసిక్తం అయ్యాయి. ప్రధానంగా పల్నాడు, మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రిలో హింస చోటుచేసుకుంది. చంద్రగిరిలో అయితే టిడిపి అభ్యర్థి పులవర్తి నాని పై దాడి జరిగింది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో సిట్ దర్యాప్తు పూర్తయింది. ఆ నివేదిక ఎలక్షన్ కమిషన్కు చేరుకుంది. ఒకటి రెండు రోజుల్లో అరెస్టులు కూడా జరగనున్నాయి. మరోవైపు అనుమానిత నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జూన్ 4 న లెక్కింపు పూర్తయితే.. జూన్ 19 వరకు కేంద్ర బలగాలు ఏపీలో ఉంచేలా ఆదేశాలు ఇచ్చారు.

అయితే తాజాగా పిఠాపురం, కాకినాడ సిటీలో కౌంటింగ్ నాడు అల్లర్లు జరుగుతాయని కేంద్ర నిఘా సంస్థ హెచ్చరించింది. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేశారు. ఆయన గెలుపు దాదాపు ఖరారు అని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాకినాడ సిటీ నుంచి ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. గతంలో ఆయన విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ హాట్ టాపిక్. కాకినాడలో మీ రౌడీయిజాన్ని అడ్డుకుంటానని పవన్ ఎన్నడో ప్రకటించారు. కాకినాడ సిటీలో ద్వారపురెడ్డికి ప్రైవేట్ సైన్యం ఉందన్న అనుమానాలు గతం నుంచి ఉన్నాయి. మరోవైపు పిఠాపురంలో కి అల్లరి మూకలు చొరబడ్డాయని మెగా బ్రదర్ నాగబాబు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ మొత్తం పరిణామ క్రమంలో పిఠాపురం తో పాటు కాకినాడ విషయంలో కేంద్ర నిఘా సంస్థల నుంచి ముందస్తు హెచ్చరికలు రావడం విశేషం. కౌంటింగ్ కు ముందే జల్లెడ పట్టాలని పోలీసులు సైతం నిర్ణయించారు. అనుమానాస్పద వ్యక్తులపై ఇప్పటినుంచి నిఘా పెంచారు.