Reddy community that drowned YCP
YCP: వైసీపీ ఓటమికి రెడ్డి సామాజిక వర్గమే కారణమా? ఆ వర్గమే దెబ్బతీసిందా? వారిలో అసంతృప్తి పెరిగిందా? అందుకే వారంతా దూరమయ్యారా? 2019 ఎన్నికల్లో గెలిపించిన వారే సైలెంట్ అయ్యారా? అందుకే వైసిపి ఓడిపోయిందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఉన్న రాయలసీమలో వైసిపి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. ఆ సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న 70 నియోజకవర్గాల్లో.. కూటమి ధాటికి నిలబడ లేకుండా పోయింది. ఒక్క రాయలసీమే కాదు రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న ప్రకాశం, నెల్లూరులో సైతం టిడిపి కూటమి వైట్ వాష్ చేసింది. దీని వెనుక రెడ్డి సామాజిక వర్గం వ్యూహాత్మక మౌనమే కారణమని తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో జగన్ ను తమ వాడిగా చూసుకొని రెడ్డి సామాజిక వర్గం అండగా నిలిచింది. పార్టీ పెట్టినప్పుడు, జగన్ పాదయాత్ర చేసినప్పుడు, 2014 ఎన్నికల సమయంలో రెడ్డి సామాజిక వర్గం ఒకే తాటి పైకి వచ్చింది. సొంత డబ్బులు పెట్టుకుని మరీ ప్రచారం చేశారు. ఎన్నికల్లో గెలిపించాలని శతవిధాలా ప్రయత్నించారు. ఆ ఎన్నికల్లో వైసిపి ఓడిపోయినా.. రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న ప్రతి నియోజకవర్గాన్ని ఆ పార్టీ కైవసం చేసుకుంది. రాయలసీమలో ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ మిగతా ప్రాంతాల్లో ఓడిపోయింది. అదే కసితో 2019 ఎన్నికల్లో పనిచేసింది రెడ్డి సామాజిక వర్గం. రాయలసీమతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా దృష్టి పెట్టింది. దాని పర్యవసానమే 151 స్థానాలతో అధికారంలోకి రావడం.
Also Read: YS Jagan vs Chandrababu : జగన్ కు గట్టి షాక్ ఇచ్చిన చంద్రబాబు
తనకు అంతటి కష్టకాలంలో అండగా నిలిచిన రెడ్డి సామాజిక వర్గానికి జగన్ పెద్దగా చేసింది లేదు. ఆ నలుగురు రెడ్డి పెద్దలు తప్పించి.. సామాన్యులకు ఒరిగిందేమీ లేదు. పార్టీ వస్తే నాలుగు రాళ్లు వెనకేసుకొస్తామని పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించలేదు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన వారికి సైతం పట్టించుకునేవారు కరువయ్యారు. పోనీ సంక్షేమ పథకాలు అందాయంటే అదీ లేదు. అగ్రవర్ణాల జాబితాలో రెడ్డి సామాజిక వర్గం ఉండడంతో ఏ సంక్షేమ పథకం కూడా దక్కలేదు. దీంతో సామాజిక వర్గంలో అట్టడుగు వర్గాల వారికి ఎటువంటి చేయూత లేకుండా పోయింది. పోనీ నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేశారంటే అది లేదు. బీసీ నినాదంతో ఎక్కడికక్కడే రెడ్డి సామాజిక వర్గాన్ని తొక్కి పెట్టారు. దాదాపు పది నియోజకవర్గాల వరకు రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కనపెట్టి వెనుకబడిన వర్గాలకు టికెట్లు ఇచ్చారు. అందుకే ఇంత చేసినా తమ గురించి పట్టించుకోని జగన్ ను.. అధికారం నుంచి దూరమైతే ఏంటి? అన్న ఆలోచనకు వచ్చారు. ఒకసారి దిగిపోతే కానీ తమ విలువ తెలియదని భావించారు. అందుకే పూర్తిగా పక్కకు తప్పుకున్నారు. కొన్నిచోట్ల వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు. ఫలితంగా వైసిపి ఘోర పరాజయం పాలయ్యింది.
Also Read: Tirumala darshan : నేడు తిరుమల దర్శన టికెట్లు విడుదల.. ఎలా బుక్ చేసుకోవాలంటే?
రాయలసీమ రెడ్డి నేతలతో పాటు ప్రకాశం, నెల్లూరుకు చెందిన రెడ్డి సామాజిక వర్గ నాయకులు పార్టీని వీడారు. జగన్ అంటే వీర విధేయత ప్రదర్శించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వారు వైసీపీని వీడడం కూడా రెడ్డి సామాజిక వర్గం పై ప్రభావం చూపింది. అసలు జగన్ పై ఈగ వాలనివ్వకుండా వ్యవహరించినా.. మిగతా వారి కోసం వారిని విడిచి పెట్టుకున్నారు జగన్. నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ కోసం వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వదులుకున్నారు జగన్. ఎన్నో రకాలుగా అనిల్ కుమార్ యాదవ్ ఇబ్బందులు పెడుతున్నా.. వేంరెడ్డి తన సన్నిహితుడు అన్న విషయాన్ని కూడా జగన్ మర్చిపోయారు. అటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో సైతం విధేయతను పట్టించుకోలేదు. రెడ్డి సామాజిక వర్గం నేతలంతా ఒక్కొక్కరు దూరం కావడంతో.. అదే సామాజిక వర్గం పై పెను ప్రభావం చూపింది. జగన్ తమ వాడు అనుకున్నామని.. కానీ ఆయన తమ వాడు కాదని రెడ్డి సామాజిక వర్గం ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ ఎన్నికల్లో సైలెంట్ అయిపోవాలని భావించింది. తద్వారా జగన్ ఓటమిని నిర్దేశించింది.